Women Welfare: తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో బ్రెస్ట్ కేన్సర్పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన పింక్ పవర్ రన్-2024 కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటుందని తమ ప్రభుత్వం నమ్ముతున్నదన్నారు.
మరిన్ని ఆసుపత్రులు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళాభ్యుదయం కోసం పలు కార్యక్రమాలు చేపట్టిందని సీఎం వివరించారు. కుటుంబంలో కీలక బాధ్యతలు నిర్వహించే మహిళల ఆరోగ్యం చాలా కీలకమని తమ ప్రభుత్వం భావిస్తోందని, అందుకే రాబోయే రోజుల్లో మహిళల కోసమే మరిన్ని ఆసుపత్రులు నిర్మించనున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరముందని, అప్పుడే సమాజంలో మంచి మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు.
కేన్సర్పై పోరాటం..
జీవనశైలి, కాలుష్యం, మారుతున్న పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా రోజు రోజుకీ కేన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతోందని, ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయని, దీనిపై మహిళలకు అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డారు. ముందస్తు పరీక్షలు నిర్వహించటం వల్ల సమస్యను వీలున్నంత మేర కట్టడి చేయవచ్చని వివరించారు.
మీ ఆలోచన బాగుంది..
బ్రెస్ట్ కేన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సుధా రెడ్డి, ఎంఈఐఎల్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘పింక్ పవర్ రన్ 2024’ కార్యక్రమాన్ని నిర్వహించటం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ముఖ్యమంత్రి అభినందించారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రారంభమైన ర్యాలీని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ప్రారంభించగా, ముగింపు ర్యాలీకి ముఖ్యమంత్రి హాజరయ్యారు. అనంతరం రన్ విజేతలకు సీఎం నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి పీఏసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ, శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి తదితరులు హాజరయ్యారు.
గిన్నిస్ రికార్డ్ యత్నం..
గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన మారథాన్ ఓల్డ్ ముంబయి జాతీయ రహదారి, ఐఎస్బీ రోడ్, టిఎన్ఓ కాలనీ మీదుగా కొనసాగి తిరిగి స్టేడియంకి చేరింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది పిల్లల, పెద్దల వరకు అందరూ గులాబీ రంగు దుస్తుల్లో ముస్తాబై పక్షి రూపంలో భారీ మానవహారంగా ఏర్పడి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేరేందుకు ప్రయత్నించారు. మూడు కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో 5 వేల మంది పాల్గొన్నారు. ఉదయాన్నే స్టూడెంట్స్, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సహా అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు పాల్గొన్న ఈ ర్యాలీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.