CM Revanth Reddy Speech About HYDRA: హైదరాబాద్ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా, అక్రమ నిర్మాణాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కోకాపేటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదని, ఒత్తిడి వచ్చినా.. మిత్రులకు ఫాంహౌస్లు ఉన్నా కూల్చివేతలేనని సీఎం వెల్లడించారు.
అక్రమ కట్టడాల కూల్చివేతలకు స్ఫూర్తి భగవద్గీత అని సీఎం తెలిపారు. శ్రీకృష్ణుడి గీతాబోధన అనుసారమే ఈ అక్రమ కట్టడాల కూల్చివేత అన్నారు. రాజకీయం కోసమో..నాయకులపై కక్ష్య కోసం అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం లేదని, అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టేనని వెల్లడించారు.
ఆక్రమణదారుల చెర నుంచి చెరువులను విముక్తి కలిగిస్తామని వెల్లడించారు. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్ లు కట్టుకున్నారని, ఆ ఫాంహౌజ్ నాలాలు గండిపేటలో కలిపారని, అందుకే హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదని, దీనికి అందరూ సహకరించాలని కోరారు.
హైదరాబాద్ లేక్ సిటీ అని, గండిపేట, ఉస్మాన్ సాగర్ హైదరాాబాద్ ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయని సీఎం అన్నారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాలకోసం చేపట్టామన్నారు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారున్నారని, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చునని చెప్పారు.
Also Read: క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి
అలాగే, సమాజాన్ని సైతం ప్రభావితం చేసేవారు ఉండవచ్చని, ఎవరినీ పట్టించుకోమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని సీఎం రేవంత్ హెచ్చరించారు.
అనంతరం గచ్చిబౌలిలో నిర్వహించిన బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారీస్ నడుస్గున్నారన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయడం సంతోషకరమన్నారు. డ్రగ్స్ నుంచి విముక్తి కలిగించి యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డ్రగ్స్ ముఠాలను ఏరిపారేస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు.
అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.. కాంగ్రెస్ రైతు ప్రభుత్వమని నిరూపించడానికే రూ.2లక్షల రుణమాఫీ చేశామని వెల్లడించారు.. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు. తన కార్యాచరణను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.