CM Revanth Reddy : తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతిచోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు.
తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతిచోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు.
బీబీనగర్ ఎయిమ్స్లో వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అలా చేస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపైనా భారం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎయిమ్స్ను సందర్శించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని సీఎం వెల్లడించారు.
ఉస్మానియా ఆస్పత్రిపై మంగళవారం హైకోర్టులో విచారణ ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందిస్తూ.. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుందామని స్పష్టం చేశారు. బోధనాసుపత్రుల్లో హౌస్ కీపింగ్ను పార్మా కంపెనీలకు ఇచ్చే అంశంపై పరిశీలించాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. ఏరియాలవారీగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను గుర్తించి వాటికి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్కీపింగ్ నిర్వహణ బాధ్యతలు ఫార్మా కంపెనీలకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నిర్వహణ ఖర్చులు కూడా వారే భరించేలా చూడాలన్నారు. ఉస్మానియా, గాంధీ రెండింటిలో ఏదో ఒక ఆసుపత్రిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా తక్షణమే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ నెల 15వ తేదీలోగా ప్రభుత్వ ఆసుపత్రులకు.. ప్రతీ మూడు నెలలకోసారి తప్పనిసరిగా ప్రయివేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్రెడ్డి.