CM Revanth Reddy : మీకేం కావాలన్న ఇచ్చేందుకు నేను రెడీ. ఇది సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ పై సమీక్ష సందర్భంగా అధికారులకు ఇచ్చిన హామీ. మీరు చేయాల్సిందల్లా డ్రగ్స్ అన్న పదం తెలంగాణలో వినిపించొద్దు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ ను రాష్ట్రంలో నామరూపాల్లేకుండా చేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, తన మార్క్ పాలన ఎలా ఉండబోతుందో అందరికీ అర్థమయ్యేలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, కొన్ని కొన్ని వ్యవహారాలపైన దృష్టి సారించారు. ఇప్పుడు వాటిపై విచారణలు చేయిస్తూ, అప్పటి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా డ్రగ్స్ వ్యవహారం పైన రేవంత్ ఫోకస్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ దందా తెలంగాణలో జరగడానికి వీల్లేదని అధికారులకు గట్టిగా చెప్పారు. అధికారులకు ఏం అవసరమో అది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు నార్కోటిక్ బ్యూరోకు సందీప్ శాండిల్యను డైరెక్టర్ గా నియమించారు.
2017లో టాలీవుడ్లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. గతంలో టాలీవుడ్ను డ్రగ్స్తో షేక్ చేసిన కెల్విన్ ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు ఒక్కోక్కటిగా బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను విచారించి..వారి నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు.
మొత్తం 12 కేసులు నమోదుచేసిన పోలీసులు 7 చార్జిషీట్లు వారిపై అప్పట్లో దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా అప్పటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో టాలీవుడ్కు చెందిన అనేక మందిని విచారించి.. వారి వాంగ్మూలం నమోదు చేశారు. డ్రగ్స్ వాడుతున్నదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా మత్తుమందుల వాడకంపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై మళ్లీ కొత్తగా సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. దీనిలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరో రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ వంటి వారిలో 12మందిని విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. అలా ఈడీ విచారణ కూడా సుమారు 2 నెలలు కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని ఈడీ తేల్చేసింది.
వారిలో ఎవరూ కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసును మూసివేసినట్లు అయింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్న సమయంలో ఈడీ రంగంలోకి దిగడం ఎక్సైజ్ శాఖకు సంకటంగా మారింది. ఆ సమయంలో అకున్ సబర్వాల్ ఆకస్మికంగా బదిలీ కావడం సంచలనం కలిగించింది. తర్వాత ఆ సిట్కు వేరే అధికారుల నేతృత్వంతో కేసు నీరుగారిపోయిందని, సిట్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఆ సమయంలో పలు విమర్శలు వచ్చాయి. అలా చేయడం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం భారీగా పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ ను పోలీసులు విచారణ పేరుతో హడావిడి చేసి మళ్లీ మొదటికి తెచ్చి వదిలేశారు. అంతకుముందు అకస్మాత్తుగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు సైలెంట్ కావడం వెనక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందనే ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం సైలెంట్ అయిపోవడం, టాలీవుడ్ ప్రముఖులంతా బీఆర్ఎస్ కీలక నాయకులతో సన్నిహితంగా మెలగడం, ఆ పార్టీకి మద్దతు పలకడం వంటివి ఎన్నో చోటు చేసుకోవడంతో దీనిపై అనేక విమర్శలు వ్యక్తం అయ్యాయి. అప్పట్లోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి డ్రగ్స్ వ్యవహారాలపై పోరాటాలు చేశారు. కోర్టుల్లో కేసులు వేశారు.
ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఆ డ్రగ్స్ వ్యవహారాన్ని తేల్చాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారంపై రేవంత్ సీరియస్ గా ఉన్నారు.అంతేకాదు నగరంలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు 13 ఏళ్ల వయస్సులోనే హై-ఎండ్ డ్రగ్స్ ఉపయోగిస్తున్నారని విచారణలో తేలింది. ఆ తర్వాత ఈ కేసు కూడా మళ్లీ తెరపైకి రాలేదు. కానీ ఇప్పటికి బండ్లగూడ ఆ పరిసరాల్లో ఇంజినీరింగ్ కాలేజీలు అనేక ఉన్నాయి. అదే ప్రాంతాల్లో ఎక్కువగా విదేశీయులు కూడా నివసిస్తారు.
వీరంతా డ్రగ్స్ ను వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులకు అమ్ముతున్నారని తెలిసినా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించని విమర్శలు ఉన్నాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కేసు బుక్ చేయడం కాదు.. వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
మొత్తంగా ఒకప్పుడు, నగరంలో వేళ్ల మీద లెక్కించే సంఖ్యలో ఉన్న పబ్బుల సంఖ్య ఇప్పుడు వందలకు చేరుకున్నాయి. వీధికో పబ్, వాడకో బార్ ఆన్నట్లుగా ఇటు మద్యం, అటు డ్రగ్స్ మత్తు జోరుగా సాగుతోంది. నిజానికి, బార్లకు పబ్బులకు మధ్య తేడా ఏదైనా ఉందంటే, బార్లలో మధ్యం మాత్రమే తొరుకుతుంది. పబ్బులలో మందుతో పాటు, డ్రగ్స్ కూడా తొరుకుతాయి. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా రేవంత్ సర్కార్ తీసుకునే చర్యలతో భవిష్యత్లో హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా ఉండబోదన్నది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది.
.
.