CM Revanth Restoring old building & a new Osmania Hospital in Goshamahal: ఉస్మానియా ఆసుపత్రి.. వందేళ్ల చరిత్ర ఈ చారిత్రక భవనానిది.. దశాబ్దాల తరబడి కోట్ల మందికి ఉచితసేవలందించిన ఘనకీర్తి ఈ భవనం సొంతం.. ఇప్పుడీ చారిత్రక భవనం చరిత్రలో నిలిచిపోయేలా.. అదే విధంగా ఇక్కడ రోగులు పడుతున్న అవస్థలు తీరేలా. కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త యాక్షన్ ప్లాన్తో ముందడుగు వేయనుంది. ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఎలా చేయబోతుంది?
దీనిపై ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? నిజానికి ఈ భవనం నిజాం పాలకుల నుంచి వచ్చిన ఓ చారిత్రక సంపద. ఎన్నో దశాబ్ధాలుగా కోట్ల మందికి సేవలందిస్తుంది. అయితే చాలా ఏళ్లుగా శిథిలావస్థలో ఉంది. పెచ్చులు ఊడటం.. భారీగా వర్షాలు వస్తే.. నీటిలో మునిగిపోవడం. ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి ఈ భవనాన్ని.. అక్కడి రోగులను. అయితే తాము ఈ భవనాన్ని కూల్చకుండానే.. సరికొత్త భవనాన్ని నిర్మిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.. దీంతో చాలా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది.
ఉస్మానియా హాస్పిటల్ చరిత్ర కంటే ముందు.. ఆ భవనం గురించి కాస్త తెలుసుకుందాం..1866.. యస్.. 1866లో సాలార్జంగ్ వన్ పాలకుడిగా ఉన్నప్పుడు మొదలైంది ఈ కట్టడ నిర్మాణం. అయితే అనేక కారణాలు, రీ డిజైన్.. కూల్చి మళ్లీ కట్టడం ఇలా అనేకం జరిగాయి. అయితే ప్రస్తుతం ఉన్న భవన నిర్మాణ పనులు మాత్రం మొదలైంది 1908లో.. మొత్తం భవనం నిర్మాణం పూర్తయ్యే సరికి 1919 వచ్చేసింది. విన్సెంట్ ఎస్క్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఈ హాస్పిటల్ను నిర్మించాడు. అఫ్కోర్స్ ఆయనే హైకోర్టు, సిటీ కాలేజ్, కాచిగూడ రైల్వే స్టేషన్ను నిర్మించారు. అది పక్కన పెడితే.. మూసి నదిని ఆనుకొని 26.5 ఎకరాల్లో ఉంటుంది ఉస్మానియా ఆసుపత్రి.. ఒక్క ఐపీ బ్లాకే 2.37 ఎకరాలు ఉంటుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ హాస్పిటల్ ఎంత పెద్దదో.. ఇది ఉస్మానియా హాస్పిటల్ చరిత్ర..
నిర్మాణం పూర్తైంది 1919లో.. ఇప్పుడు 2024..వందేళ్లు దాటి ఐదేళ్లు అయ్యింది. అయినా అంతే ఠీవీగా నిల్చొని ఉంది ఈ హెరిటేజ్ బిల్డింగ్.. అయితే గత కొన్నేళ్లుగా ఈ భవనం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటోంది. అంటే నిర్మాణం విషయంలో కాదు. పురాతన కట్టడం కదా.. ఎప్పుడేం జరిగేది తెలీదు. ఇలాంటి భవనంలో రోగులకు చికిత్స అందించడం ఎంత వరకు సేఫ్? అనేది ఆ ప్రశ్న.. నిజానికి 2005, 2010 మధ్య విమర్శలు పెరిగాయి. దీంతో 2010లో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ రిపేర్స్ కోసం 200 కోట్ల నిధులను రిలీజ్ చేశారు. కానీ పనులు జరగలేదు. అంతేకాదు చారిత్రక కట్టడానికి రిపేర్లు చేసి.. మిగిలిన భవనాలను కూలగొట్టి వాటి స్థానంలో కొత్తవి కట్టాలని నిర్ణయించారు. అదీ ముందుకు జరగలేదు.
Also Read: అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..ఘనస్వాగతం పలికిన అభిమానులు
ఇక 2015లో అప్పటి కేసీఆర్ సర్కార్.. ఏకంగా చారిత్రక కట్టడాన్ని కూల్చేసి వాటి స్థానంలో 24 అంతస్తులుండే రెండు భారీ భవనాలను నిర్మించాలనుకుంది..దాని కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కేసీఆర్ కూడా స్వయంగా ఉస్మానియాకు వచ్చి పరిశీలించారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కొత్త హాస్పిటల్ నిర్మాణం ఆలోచన బాగానే ఉంది కానీ. చారిత్రక కట్టడాన్ని కూల్చడం ఎందుకు? అనే ప్రశ్న మొదలైంది. దీనిపై కోర్టుకు కూడా ఎక్కారు కొందరు. దీంతో పంచాయతీ ఎటూ తేలలేదు. అసలు ఈ భవనం ఎంత బలంగా ఉంది? అనే క్వశ్చన్ కూడా రెయిజ్ అయ్యింది. కొన్ని నిపుణుల కమిటీలు అధ్యయనం కూడా చేశాయి.. కానీ భిన్న రిపోర్టులు ఇచ్చాయి.
ఉదాహరణకు.. JNTU ఏమో బిల్డింగ్ రిపేర్ చేసినా.. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండదని రిపోర్ట్ ఇచ్చింది. కానీ చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి కృషి చేసే ట్రస్ట్ ఇంటాక్ స్టడీలో ఏమో.. జస్ట్ ప్లాస్టరింగ్ పనులు చేస్తే చాలు.. నిర్మాణం చెక్కు చెదరదని తెలిపింది. వీరేమంటారంటే భవనం బలంగా, భద్రంగా ఉందని చెప్పారు. చాలా కాలం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. జస్ట్ ప్లాస్టరింగ్ పనులు చేస్తే.. అన్ని పనులు సవ్యంగా చేసుకోవచ్చని తెలిపింది. కానీ మరికొందరేమో.. అసలు మెయిన్ బిల్డింగ్ కిందనుంచే మురుగు కాల్వ వెళుతుంది. పాతవి కూల్చకుండా కొత్త నిర్మాణాలను చేపట్టడం అసాధ్యమని మరికొందరు చెబుతున్నారు. ఇలా అనేక రకాల వాదనలు రావడంతో.. కథ మళ్లీ మొదటికి వచ్చింది.
దీనికితోడు అధికార, విపక్షాల మధ్య ఓ రాజకీయ అంశంగా మారిపోయింది ఉస్మానియా ఆసుపత్రి. నిర్మిస్తామన్న కోర్టుకు వెళ్లి విపక్షాలు అడ్డుకున్నాయంటూ బీఆర్ఎస్ నేతలు లాజిక్లు మాట్లాడారు. ఇక్కడికి ఇదే నయమని చేతులు దులుపుకున్నారు. దీంతో భవనం శిథిలమవుతుంది.. రోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ అంశం తెరపైకి వచ్చింది. కర్ర విరగకూడదు. పాము చావకూడదు అనే రేంజ్లో దీనికి సొల్యూషన్ ఇచ్చేశారు సీఎం రేవంత్ రెడ్డి.. ఉస్మానియా హాస్పిటల్ ప్రస్తుత భవనం అలానే ఉంటుంది.
అది చెక్కు చెదరకుండా ఉండేందుకుచర్యలు తీసుకుంటూనే.. గోషామహల్ పోలీస్ క్వార్టర్స్లోని 30 ఎకరాల స్థలంలో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించింది. కాబట్టి.. అటు చరిత్ర కారులు హ్యాపి.. ఇటు సాధారణ ప్రజలు హ్యాపి.. అటు రోగులు కూడా హ్యాపి. నిజానికి సమస్యకు నిజంగా చెక్ పెట్టాలనుకుంటే ఇలా చేయవచ్చు. సాగదీయాలనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలా కోర్టులు, కేసుల పేరు చెప్పి తప్పించుకోవచ్చు. మొత్తానికి ఓల్డ్ సిటీ. కాదు.. కాదు.. ఒరిజినల్ సిటీలో ఉన్న ఉస్మానియా హాస్పిటల్.. ఇక ఉస్మానయా హాస్పిటల్గా మారబోతుంది.