YSR Jayanthi Celebrations in Gandhi Bhavan : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా గాంధీభవన్ లో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క పాల్గొని.. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు వైఎస్ రాజశేఖర్ చేసిన అభివృద్ధే.. నేడు తెలంగాణకు బాటలు వేసిందన్నారు. నాడు చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ వైఎస్సార్ చేసిన పాదయాత్ర.. 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. ఈనాడు అదే స్ఫూర్తితో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. దాని ఫలితంగా తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వలో ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించామన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే వైఎస్సార్ ఆకాంక్ష అని పేర్కొన్న సీఎం రేవంత్.. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని పదవికి ఒకే ఒక్క అడుగు దూరంలోనే ఉందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తే.. పేదలకు సంక్షేమం అందడంతో పాటు.. దేశం అభివృద్ధి చెందుతుందని, నిరుపేద యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత తీసుకుని ఎవరైతే పనిచేస్తారో.. వాళ్లే వైఎస్సార్ అసలు రాజకీయ వారసులని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం దేశానికి చాలా అవసరమన్నారు.
Also Read : తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు, 34 కార్పొరేషన్ ఛైర్మన్లకు పదవులు
వైఎస్సార్ ఇచ్చిన సందేశాన్ని తీసుకుని.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని అందరూ ప్రతినబూనాలని కోరారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినవారిని రాహుల్ గాంధీ వ్యతిరేకులుగా పరిగణిస్తామన్నారు. కాంగ్రెస్ ను వీడిన నేతలంతా తిరిగి పార్టీలోకి రావాలని కోరారు. పార్టీని వీడిన వారందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, అందరం కలిసి రాహుల్ ను ప్రధానిని చేసేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
దేశంలో సంక్షేమం అంటే గుర్తొచ్చేది వైఎస్సార్ పేరేనన్నారు. మూసి అభివృద్ధి, మెట్రోరైలు, హైదరాబాద్ లో శాంతి భద్రతల విషయంలో వైఎస్సార్ తమకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడి పదవిని చేపట్టి నిన్నటికి మూడేళ్లైందని తెలిపారు. వైఎస్సార్ జయంతి సందర్భంగానే 35 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని ఇచ్చామని వెల్లడించారు.
అంతకుముందు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గొప్ప పనులు చేసి అతి తక్కువ సమయంలో కోట్లాది మంది ప్రజల మనసులో వైఎస్సార్ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. వైఎస్సార్.. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా చూశారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తామని పేర్కొన్నారు. జలయజ్ఞం ద్వారా వ్యవసాయానికి నీరందించి రైతులకు, పీజు రీ ఎంబర్స్ మెంట్ చేసి పేద పిల్లలకు వైఎస్సార్ దేవుడయ్యారని కొనియాడారు. ఆరోగ్యశ్రీతో పేదలవైద్యానికి మేమున్నామన్న భరోసా ఇచ్చారని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని కితాబిచ్చారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం ఇచ్చిన హామీని అమలు చేస్తామని తెలిపారు.