CM Revanth Reddy : తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు తర్వాత పోలీస్ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్రెడ్డి. కొత్త సర్కార్ మాదిరే.. కొత్త టీమ్తో రేవంత్ తన పాలన మార్క్ చూపించనున్నారు. ఈ మేరకు మార్పులు చేర్పులపై కసరత్తు చేపట్టిన ముఖ్యమంత్రి పోలీస్శాఖలో ప్రక్షాళనను ప్రారంభించారు. సిన్సీయారిటీకి పెద్ద పీట వేస్తూ తన జట్టులోకి తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే కీలక కమిషనరేట్లైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలను బదిలీ చేసింది సర్కార్. ఆ స్థానాల్లో హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే త్వరలో మరికొన్ని కమిషనరేట్లలోనూ సీపీలను, జిల్లా ఎస్పీలను మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ వచ్చాక మొదట ఏర్పడింది రాచకొండ కమిషనరేట్. బదలీల్లో భాగంగా రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమించింది. ప్రస్తుతం సుధీర్ బాబు హైదరాబాద్ ట్రాఫిక్ ఆడిషన్ సీపీగా విధులను నిర్వహిస్తున్నారు. గతంలో వరంగల్ సీపీగా, రాచకొండ జాయింట్ సీపీగా పని చేసిన అనుభవం ఉండడంతో సుధీర్ బాబుకు సీపీగా పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం.
అలాగే సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్రను డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ.. నూతన సీపీగా అవినాష్ మహంతిని నియమించింది. హైదరాబాద్ సీపీగా ఆనంద్ తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యకు బాధ్యతలు అప్పగించారు. అయితే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో శాండిల్యను యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా బదిలి చేస్తూ.. హైదరాబాద్ నూతన సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించింది సర్కార్.