CM Revanth Reddy : లక్షమందికి ఉపాధి కల్పించే ఫాక్స్ కాన్ సంస్థ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఫాక్స్ కాన్ కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, రాష్ట్ర ఐ.టి , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సి ఎస్ శాంతి కుమారి, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం.
ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంభిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి.