CM Revanth Reddy speech(Political news in telangana): హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారికి నగర బహిష్కరణ శిక్ష తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎల్బీ నగర్ బైరామల్ గూడ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన సీఎం.. ఎప్పుడు ఎల్బీ నగర్ కు వచ్చినా తన గుండె వేగం పెరుగుతుందని తెలిపారు. తనకు అండగా ఉండే వారంతా ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పారు. ఎల్బీ నగర్ ప్రజల అభిమానం మర్చిపోలేనిదని సీఎం వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా అభివృద్థి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్కు మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. అటు రాజేంద్ర నగర్లో హైకోర్టు నిర్మించి అక్కడివరకు మెట్రో నిర్మిస్తామన్నారు.
ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి మీదుగా మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత తమపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మురికి కూపంగా మారిన మూసీ పరివాహక ప్రాంతాన్ని 50 వేల కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. లండన్ థెమ్స్ నదీపరివాహక ప్రాంతంలా మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
Read More: టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ..
అటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 354 కి.మీ ల రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల సబర్బన్ హైదరాబాద్ కింద రేడియల్ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తామని అన్నారు.
అందరి సలహాలు, సూచనలతో వైబ్రంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నామని సీఎం తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డు పడొద్దని.. అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారికి నగర బహిష్కరణ శిక్ష విధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.