CM Revanth Reddy launches Rythu Nestham(Political news today telangana): తెలంగాణలో కొత్త కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సీఎం మాట్లాడారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ఏర్పాట్లు చేశారు. రైతు నేస్తం ప్రారంభ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
రైతు నేస్తం ద్వారా డిజిటల్ సేవలు అందిస్తారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో ఒక క్లస్టర్ ను ఎంపిక చేశారు. విడతల వారీగా 2, 601 క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికలకు వీడియో కాన్ఫెరెన్ సౌకర్యం కల్పిస్తారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.
కరువు వచ్చినా.. ఎంత కష్టం వచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులున్నాయన్నారు. కలిసికట్టుగా కరువును ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఏడాదిగా సరైన వర్షపాతం లేకపోవటంతో రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని తెలిపారు. అందుకే అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు.
రిజర్వాయర్ల నుంచి నీళ్లు విడుదల చేయాలని కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతంల్లోని రైతులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారని సీఎం చెప్పారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేసవిలో తాగునీటి కష్టాలు రాకుండా చూడాల్సిన అవసరముందన్నారు. అందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం అన్నారు.
పలువురు రైతులు కాన్ఫరెన్స్ లో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. తాము పండిస్తున్న పంటల ద్వారా లాభాలు సాధిస్తున్న తీరును వివరించారు. రైతు నేస్తం కార్యక్రమానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం సహకారం అందిస్తోంది. అధికారులతోపాటు వ్యవసాయ నిపుణులు నేరుగా పంట పొలాల నుంచి రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకుంటారు. సాగుపై సలహాలు, సూచనలతోపాటు అధునాతన మెలకువలను అందిస్తారు. ఆదర్శ రైతుల తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేందుకు వీలు కల్పిస్తారు. రైతు నేస్తం ప్రారంభోత్సంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాలుపంచుకున్నారు.
ప్రతి సీజన్ లో రైతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించేందుకు సలహాలు, సూచనలిచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. నేరుగా రైతులు వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుందన్నారు. విత్తనాలు, ఎరువులు, ఏ పంట వేయాలనేది మొదలు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేంత వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు.
రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర రావాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్యాచరణ చేస్తోందన్నారు. రైతు భరోసా, రైతు రుణ మాఫీ, రైతులకు విత్తనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వరి, పత్తి , మిర్చీ పంటలకే పరిమితం కావద్దని రైతులకు సూచించారు. ఇతర పంటలు సాగు చేయాలని కోరారు. పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. తక్కువ నీళ్లతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి, ఎక్కువ లాభాలు వచ్చేలా పంటల ప్రణాళిక చేసుకోవాలని చెప్పారు.
వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన రైతు నేస్తంను భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తామని చెప్పారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవల పంటల భీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు. రైతులు చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటుందన్నారు. రైతులు ధీమాగా బతికేందుకు వీలుగా పంటల బీమా పని చేస్తుందని చెప్పారు. పంట పెట్టుబడి పెట్టినప్పటి నుంచి కరువు వచ్చినా, వరద వచ్చినా నష్టపరిహారం అందుతుందన్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి వారికి తిరిగి వస్తుందని అన్నారు. దీంతో రైతులు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉండదన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ధైర్యం కోల్పోవద్దన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు.