CM Revanth Reddy : కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్ స్థాయి కన్వీనర్ల(Booth Level Agents) సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి.. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలోకి వచ్చామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామన్నారు. అధికారం చేపట్టి 50 రోజులు కాకుండానే హామీలు అమలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 హామీలు అమలు చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి ఆఖరు నాటికి రైతు భరోసా నగదు జమ చేస్తామని ప్రటించారు.
గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన హమీలు అమలు చేసిందా? అని సీఎం రేవంత్ నిలదీశారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలన్నారు. కొందరు తనను మేస్త్రి అని విమర్శిస్తున్నారని.. అవును.. తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీనేనని స్పష్టంచేశారు.
అవినీతిపరులు, కోటీశ్వరులను కేసీఆర్ రాజ్యసభకు పంపించారని సీఎం రేవంత్ అన్నారు. బలహీన వర్గాల బిడ్డలు మందుల శామ్యూల్, వెడ్మ బొజ్జుకి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చి గెలిపించిందన్నారు. రైతు బిడ్డనైన తాను సీఎం అయ్యానన్నారు. కాంగ్రెస్ లో అందరికీ అవకాశాలు ఉంటాయని తెలిపారు. లోక్సభ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాం.. పార్లమెంట్ ఎన్నికల్లో తరిమికొడదాం అని పిలుపునిచ్చారు. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదని స్పష్టంచేశారు.
పులి వస్తుందని గులాబీ నేతలు అంటున్నారని.. పులి వస్తే బోనులో పెట్టి బొందపెడతామని రేవంత్ హెచ్చరించారు. అభ్యర్థులను మారిస్తే గెలిచే వాళ్లమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. మార్చాల్సింది అభ్యర్థులను కాదు.. కేసీఆర్ కుటుంబాన్ని అని రేవంత్రెడ్డి సెటైర్లు వేశారు.