CM Revanth Reddy Tour to Kondareddypalli : ఈసారి దసరా పండుగ కొండారెడ్డిపల్లికి మహర్దశను సాధించి పెట్టింది. తొలిసారిగా సీఎం హోదాలో స్వగ్రామంలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డికి అడుగడుగునా గ్రామస్థులు నీరాజనాలు పలికారు. తమ అభిమాన నేత, తమ గ్రామస్తుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారిగా ఊరికి విచ్చేస్తున్న సందర్భంగా పల్లెవాసుల సంబరం అంబరాన్ని తాకింది. ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి గ్రామస్తులు గజమాల, పూల జల్లులు, డప్పు దరువులు, కొలాటాలతో ఘన స్వాగతం పలికారు.
మరోవైపు సీఎం సైతం గ్రామస్తుల అంచనాలను అందుకున్నారు. వారికి దసరా పండుగ సందర్భంగా వరాల జల్లు కురిపించారు. కొండారెడ్డిపల్లి రూపురేఖలు మార్చేందుకు పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు.
నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఏటా దసరా పండగను స్వగ్రామంలో చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతున్నా, ముఖ్యమంత్రిగా రేవంత్ కొండారెడ్డిపల్లికి రాలేదు.
దసరా కావడంతో ఆనవాయితీని కొనసాగిస్తూ సీఎం సొంత ఊరికి రావడంతో ఇటు అధికార యంత్రాంగం సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది.
పండుగ నేపథ్యంలో గ్రామంలో రూ.72 లక్షలతో కొత్త పంచాయతీ భవనం, రూ.55 లక్షలతో అమర జవాను యాదయ్య స్మారక గ్రంథాలయం, రూ.45 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ సహా రూ.45 లక్షలతో పశు వైద్యశాల భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తమ గ్రామంలో భారీ స్థాయిలో అభివృద్ది కార్యక్రమాలు మొదలవుతున్నందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.