Revanth On Musi River: మూసీపై రాజకీయాలు హీటెక్కాయా? సీఎం రేవంత్రెడ్డి సూచనలపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? మూసీపై అసెంబ్లీలో చర్చకు కారు పార్టీ నేతలు సిద్ధమవుతారా? ఈ వ్యవహారంలో అధికార పార్టీకి బీఆర్ఎస్ చిక్కినట్టేనా? రాత్రి కేసీఆర్తో చర్చల వెనుక ఏం జరిగింది? ఎందుకు బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడుతున్నారు? ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజలను వెంటాడు తున్నాయి.
తెలంగాణలో మూసీ పునరుజ్జీవంపై రాజకీయాలు హీటెక్కాయి. అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. కారు పార్టీ నేతల వ్యాఖ్యలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. ముఖ్యమంత్రి చేసిన సూచనలు స్వీకరించకుంటే ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది కారు పార్టీ. మూసీ వ్యవహారం తమను ముంచడం ఖాయమనే చర్చ ఆ పార్టీ నేతల్లో అంతర్గతంగా మొదలైపోయింది.
గురువారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి, మూసీ పునరుజ్జీవనపై వివరణ ఇచ్చారు. దాని గురించి డీటేల్గా చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు మూడు సలహాలు ఇచ్చారు. మూసీ పునరుజ్జీవనపై ఏం చేయాల్లో అసెంబ్లీలో సలహాలు ఇవ్వాలన్నది మొదటిది. దీనిపై డీటేల్గా సభలో చర్చిద్దామన్నారు.
మూసీ పునరుజ్జీవం అడ్డుకున్న నేతలకు మరో సలహా ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. అడ్డుకుంటున్న ముగ్గురు నేతలు కేటీఆర్, హరీష్రావు, ఎంపీ ఈటల రాజేందర్ మూడునెలలపాటు ఆయా ప్రాంతాల్లో ఉండాలంటూ మెలిక పెట్టారు. ఆ ప్రాంతంలో మీరుంటే ప్రక్షాళన కార్యక్రమాన్ని నిలిపివేస్తామని చెప్పకనే చెప్పేశారు.
ALSO READ: అన్విత… నమ్మితే అంతే ఇక..!
మూడోది ప్రాజెక్టులపై మీరు ఎక్కడికి రమన్నా వస్తానని తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్రెడ్డి. ఆ అవకాశాన్ని కూడా విపక్ష నేతలకు వదిలేశారు. డేట్, టైమ్, ప్లేస్.. ఎక్కడైనా, ఎప్పుడైనా సెక్యూరిటీ లేకుండా రావటానికి తాను సిద్ధమేనని కుండబద్దలు కొట్టేశారు.
ఈ వ్యవహారాన్ని కేసీఆర్ క్షుణ్ణంగా గమనిస్తున్నారు. గతరాత్రి కేటీఆర్, హరీష్రావులను తన ఇంటికి అధినేత పిలిచినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు మధ్య చిన్నపాటి చర్చ జరిగిందట. ముఖ్యమంత్రి మాటలపై మీడియా ముందు జాగ్రత్త మాట్లాడాలని సలహా ఇచ్చారు పెద్దాయన. మనం ఏం మాట్లాడినా మన మెడకు చుట్టుకునే విధంగా ఉండకూడదన్నది దాని సారాంశం.
కేసీఆర్తో సమావేశం తర్వాత ఆ ఇద్దరు నేతలు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారట. మూసీపై ఎలా ముందుకు వెళ్లాలని చర్చించుకున్నారట. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బెటరని సూచన చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో కారు నేతలు ఒకింత టెన్షన్ పడినట్టే కనిపిస్తోందని అంటున్నారు.