CM Revanth Reddy: ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్తో మాట్లాడారు. ఘటన ఎలా జరిగింది.. అందుకు సంబంధించిన వివరాలతో పాటు తెలంగాణ వాసులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. మృతుల్లో ఎవరైనా రాష్ట్ర వాసులంటే బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
తెలంగాణ వాసులు ఎవరూ లేరని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ తెలిపారు. మృతుల్లో తానియా సోని బీహార్ రాష్ట్రానికి చెందిన యువతి అని, ఆమె తండ్రి విజయ్ కుమార్ సింగరేణి సంస్థలో సీనియర్ మేనేజర్గా మంచిర్యాలలో పని చేస్తున్నారని ముఖ్యమంత్రికి తెలిపారు. తానియా సోని మృతదేహాన్ని తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీంతో విజయ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెసిడెంట్ కమిషనర్ను సీఎం ఆదేశించారు.
ఢిల్లీలో శనివారం భారీ వర్షాల కారణంగా రాజేంద్ర నగర్లో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్ లోకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఈ ఘటనలో అక్కడే చదువుకుంటున్న విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా సీఎం ఈ ఘటనపై ఆరా తీసారు.