Congress: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం రాత్రి హస్తినకు బయలు దేరిన ముఖ్యమంత్రి మరో రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో పార్టీ అధిష్టానంతో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అలాగే, తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్కాన్ – యాపిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నట్లు తెలిసింది.
ఫాక్స్కాన్తో చర్చలు
యాపిల్ ఫోన్ అనుబంధ పరికరాలు తయారు చేసే ఫాక్స్కాన్కు.. కొంగర కలాన్లో గత ప్రభుత్వం దాదాపు 120 ఎకరాలు కేటాయించింది. లక్ష ఉద్యోగాలు కల్పించేలా ఫాక్స్కాన్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే.. ఫాక్స్కాన్ బెంగళూరుకు వెళుతోందంటూ ఎన్నికల సమయంలో ప్రచారం కూడా జరిగింది. కానీ.. ఎన్నికల తర్వాత 2023, డిసెంబర్ 26న సెక్రటేరియట్లో ఫాక్స్కాన్ ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిశ్రమల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని రేవంత్ రెడ్డి వారికి వివరించారు. ఈ నేపథ్యంలో నేడు టీం ఢిల్లీలో ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.
Also Read: Congress: బ్రేకింగ్ న్యూస్.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి కాంగ్రెస్ పిలుపు
సోనియా, రాహుల్కు ఆహ్వానం
మరోవైపు నేడు పార్టీ హైకమాండ్తోనూ సీఎం భేటీ కానున్నారు. గతంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చినందున వరంగల్లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని పీసీసీ భావిస్తోంది. ఈ ‘రైతు కృతజ్ఞత సభ’కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అలాగే, సచివాలయం ఎదురుగా రాజీవ్గాంధీ విగ్రహ ఆవిష్కరణ సభకు సోనియా గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, పీసీసీ అధ్యక్ష ఎన్నిక, కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర అగ్రనేతలతో చర్చించనున్నారని గాంధీ భవన్ వర్గాల సమాచారం.