Telangana Vijaya Dairy: విజయ డెయిరీ పరిస్థితిపై బిగ్ టీవీ కథనాలతో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. విజయ డెయిరీ నష్టాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో విజయ డెయిరీని దెబ్బతీసేలా, అప్పటి మంత్రి ఒకరు తన కుటుంబ సభ్యులతో ఓ ప్రైవేట్ డెయిరీని నిర్వహించారు. టెండర్లే పిలవకుండా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు మాజీ మంత్రి డెయిరీ ద్వారా పాలు సరఫరా చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. పథకం ప్రకారమే మాజీ మంత్రి ప్రయోజనాలు పొందారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేయడంతో.. మాజీ మంత్రి ప్రైవేట్ డెయిరీ వ్యవహారాలపై కాంగ్రెస్ సర్కార్ ఆరా తీస్తోంది.
ఆ డెయిరీకి గత ప్రభుత్వం అందించిన సహకారం ఏ స్థాయిలో ఉందనే దానిపైనా అధికారులు దృష్టిసారించారు. మరోవైపు.. విజయ డెయిరీకి పాలు అమ్మిన వారికి గత ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టింది. BRS సర్కార్ ఉద్దేశపూర్వకంగానే పాడి రైతులను మోసం చేసిందా? మంత్రి డెయిరీకి లబ్ది చేకూర్చేందుకే విజయ డెయిరీని దెబ్బ తీసిందా? అనే దానిపై నివేదిక ఇవ్వడంతో పాటు సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్రెడ్డి.
ఉపాధి కల్పనపై ఫోకస్
రాష్ట్రంలోని యువతకు నైపుణ్యం పెంపు, ఉపాధి కల్పనపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో సచివాలయంలో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణలోని ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ అప్ గ్రేడ్ చేయాలన్నారు. సిలబస్ రూపకల్పనకు కమిటీని నియమించి నిపుణులు, విద్యావేత్తల సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read: ఒక్కొక్కరికి అకౌంట్లలో రూ.15వేలు జమ.. కేంద్ర మంత్రి వెల్లడి
రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ఐటీఐ కళాశాలల పర్యవేక్షణ, తనిఖీలు క్రమం తప్పకుండా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు.