CM Revanth Reddy in Collectors Meeting: ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారున్నారని, వారంతా ఇక్కడి సంస్కృతిలో భాగస్వామ్యమవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనన్నారు. కలెక్టర్లు ప్రభుత్వానికి కళ్లు, చెవులు లాంటి వారన్నారు. గతేడాది డిసెంబర్ 24న తొలిసారి నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించి నిజమైన లబ్ధిదారుల్ని గుర్తించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కలెక్టర్లు తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని సూచించారు. తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని చెప్పారు. ఒక శంకరన్, శ్రీధరన్ లా.. సామాన్య ప్రజలు కలెక్టర్లను గుర్తుంచుకునేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పాలనపై ప్రజల ఆలోచనలేంటో క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలన్నారు. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే.. ఎలాంటి సంతృప్తి ఉండదన్నారు. కలెక్టర్లు తీసుకునే ప్రతీచర్య ప్రజా ప్రభుత్వమని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు.
ఈ ప్రభుత్వంలో పారదర్శకమైన ప్రజాహిత పాలనను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి విద్యావ్యవస్థ అత్యంత కీలకమన్న సీఎం.. విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ఆదేశించారు. ప్రతి పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.85 వేలు ఖర్చు చేస్తోందని తెలిపారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్ని పర్యవేక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాలని తెలిపారు.
Also Read: HarishRao wearing TRS scarf: బీఆర్ఎస్లో మార్పులు, టీఆర్ఎస్ కండువాతో హరీష్రావు
కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు బదిలీలపై వెళ్తుంటే.. విద్యార్థులు కంటతడి పెట్టుకున్న ఘటనలున్నాయని, కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి ప్రజావాణికి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వమని ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.