CM Revanth on Drugs: డ్రగ్స్ నిర్మూలనలో ఎలాంటి రాజీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్పై.. రేవంత్ రెడ్డి సమీక్షించారు. సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, అదనపు డీజీ సీవీఆనంద్, సీఐడీ అదనపు డీజీ మహేష్ భగవత్, పోలీసు అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిపై యత్రాంగంతో సమాలోచనలు చేశారు. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, కొకైన్, హెరాయిన్ సరఫరాను నియంత్రించి వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్ను నియమిస్తామని సీఎం ప్రకటించారు.
యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగాన్ని బలోపేతం చేయాలని, డ్రగ్స్ చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినపడకూడదని స్పష్టం చేశారు. డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. దీనిపై అసెంబ్లీలోనూ ఆయన గతంలో ప్రకటన చేశారు. డ్రగ్స్కు సంబంధం ఉన్నవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.
తమ హయాంలో డ్రగ్స్ విషయంలో కఠినంగానే వ్యవహరించామని.. దానికోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి. సీవీ ఆనంద్ లాంటి డైనమిక్ అధికారిని నియమించామన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. గత ప్రభుత్వం.. ఈ విషయంలో ఉదాసీనతగా వ్యవహరించిందనే వ్యాఖ్యలు సరికాదని అసెంబ్లీలో కేటీఆర్ అన్నారు.
BRS హాయంలో హైదరాబాద్ డ్రగ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారిందని.. తాము ప్రభుత్వంలోకి వచ్చాక.. డ్రగ్స్ నిర్మూలన విషయంలో తగ్గేదిలేదని ఆయన ఎన్నికలకు ముందే చెప్పారు. డ్రగ్స్ ద్వారా కేసీఆర్ కుటుంబం వేలకోట్లు సంపాదించిందిన.. యువత భవిష్యత్ ఫణంగా పెట్టి.. కోట్లు దండుకున్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు. తాను అమరవీరుల స్థూపం వద్ద శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పటమే కాకుండా.. అక్కడ కూర్చున్నా.. నాడు కేటీఆర్ రాకుండా పారిపోయారని గతంలో రేవంత్ అన్నారు.
డ్రగ్స్కు నిలయంగా హైదరాబాద్ను మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బీజేపీ కూడా ఆరోపణలు చేసింది. దానిపై కేసీఆర్ సర్కార్.. నోరు మెదపలేదని..తద్వారా వారి కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు సంజయ్.
తాజాగా.. సేవ్ సొసైటీ.. సేవ్ జనరేషన్.. సేవ్ కిడ్స్ నినాదంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎవరూ కాంప్రమైజ్ కావొద్దన్నారు. డ్రగ్స్ తీసుకోవాలంటే భయపడాలన్నారు. డ్రగ్స్ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్నారు. తెలంగాణలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించాలని ఆదేశించారు. శాఖాపరమైన బలోపేతం కోసం ఏది కావాలంటే అది చేస్తామన్నారు. డ్రగ్స్ నిర్మూలన ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నారు. ప్రతి నెలా నార్కోటిక్ బ్యూరోపైన తప్పకుండా రివ్యూ చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
.
.