Cm Revanth Reddy Delhi Tour : సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం దిల్లీకి బయల్దేరి వెళ్లారు. తనతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్రానికి మంత్రి వర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు ప్రధానంగా దిల్లీ పర్యటన సాగనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా పది నెలలు కావస్తోంది. ఈ మేరకు పలు జిల్లాల్లో మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం లేదు. ఇదే సమయంలో క్యాబినెట్ లో ఆరు ఖాళీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కసరత్తులు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలన్న అంశంపై మరోసారి అధిష్టానం ఆమోదం తీసుకుని ముందుకెళ్లాలన్నది టీపీసీసీ భావిస్తున్నట్లు సమాచారం.
కొత్త మంత్రులెవరూ…
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోటాలో మంచిర్యాల నుంచి సీనియర్ నేత, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తాను మంత్రి ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో గడ్డం బ్రదర్స్ బెల్లంపల్లి చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోడ్, గడ్డం వివేక్ ఇద్దరూ మంత్రి రేసులో ఉన్నామంటున్నారు.
అన్నదమ్ములు ఇద్దరూ కాక ఫ్యామిలీ కోటాలో తమకు మంత్రి పదవీ కావాలని ఏకంగా సోనియా గాంధీ రేంజ్ లో సంప్రదింపులు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం లేదు కాబట్టి సీనియర్ కాంగ్రెస్ నేతగా అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆశిస్తున్నారట.
ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం తాను మినిస్టర్ రేసులో ఉన్నానని అంటున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి , బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
ఆరు బెర్తులు ఖాళీ…
ఇలా మొత్తం ఆరు బెర్తులు ఖాలీగా ఉంటే ఒక రెండు మాత్రం వదిలేసి మిగతా నాలుగు భర్తీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరో రెండు పదవులు అలాగే రిజర్వ్ చేస్తారని సమాచారం.
ఈ నెలాఖరులోపు క్యాబినెట్ విస్తరణ పూర్తి కానున్నట్లు పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నెల 17న హస్తీనాలో సీడబ్ల్యుసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్లు హాజరవుతారు. ఆ మరుసటి రోజున మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. తెలంగాణ నుంచి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డిలు కూడా సీడబ్ల్యూసీ సభ్యులైన కారణంగా ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది.
నలుగురికే ఛాన్స్ మరి…
తెలంగాణ మంత్రి మండలిలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులున్నారు. కొత్తగా నలుగురికి అవకాశం దక్కితే ఈ సంఖ్య 15కు చేరనుంది. తెలంగాణలో 119 అసెంబ్లీ సభ్యులకు గానూ కేవలం 17 మంది మంత్రులకే అవకాశం ఉంటుంది.
హరియాణాలో అలా ఎందుకు అయ్యింది…
ఇటీవలే హరియాణా ఎన్నికల్లో పార్టీ గెలిచే స్థాయి నుంచి ఓటమిపాలవడంపై హైకమాండ్ మేథోమథనం చేయనున్నారట. ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక త్వరలోనే మహారాష్ట్ర, ఝార్ఘండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపైనా సీడబ్ల్యూసీలో చర్చించనున్నట్లు టీపీసీసీ వర్గాలు అంటున్నాయి.
Also Read : 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్