CM Revanth Reddy: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను ఉద్దేశించి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా.. పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని, ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి తెలంగాణ పునః నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరికొద్ది గంటల్లో పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. దీనితో పరీక్షలు కూడా ప్రారంభం కాగా.. అభ్యర్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళన బాట చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. పరీక్ష నిర్వహణలో ఎటువంటి మార్పులు ఉండవని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రకటించారు. సీఎం మాట వినని అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువడించింది.
ప్రస్తుతం పరీక్షల నిర్వహణ దశలో ఉన్న నేపథ్యంలో తాము ఎటువంటి జోక్యం చేసుకోలేమని, మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. దీంతో ఈ నెల 27వ తేదీ వరకు జరిగే పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ లభించగా.. పరీక్ష నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం, అన్ని చర్యలు తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలలో మొత్తం 46 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయవంతంగా పరీక్ష ప్రారంభం కాగా.. అభ్యర్థులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పరీక్షకు భారీగానే హాజరయ్యారు. ఈ సందర్భంగా పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.
ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న…
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు …
హాజరవుతున్న అభ్యర్థులకు …
నా శుభాకాంక్షలు.ఎటువంటి ఆందోళన చెందకుండా…
పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.ఈ పరీక్షల్లో మీరు …
విజయం సాధించి…
తెలంగాణ పునర్ నిర్మాణంలో…
భాగస్వాములు కావాలని…
మనస్ఫూర్తిగా…— Revanth Reddy (@revanth_anumula) October 21, 2024