CM Revanth Reddy : తెలంగాణ విద్యుత్తు రంగంపై శాసనసభలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని అధికారం పక్షం ఆరోపించింది. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ సిద్ధమని జగదీశ్ రెడ్డి సవాల్ చేశారు. గత ప్రభుత్వంలో విద్యుత్తు రంగంలోని మూడు ప్రధాన అంశాలపై జ్యూడిషియల్ విచారణ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పదాలను అధికార పక్షం ఎండగట్టింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని, రూ.10 వేల కోట్లను జగదీశ్రెడ్డి తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. టెండర్ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు 24 గంటల కరెంట్ ఎప్పుడూ ఇవ్వలేదన్నారు.
తన హయాంలో అర ఎకరం కూడా ఎండలేదని జగదీశ్రెడ్డి సభలో స్పష్టం చేశారు. విద్యుత్పై ధర్నాలు చేసే అవకాశం మేం ఇవ్వలేదన్నారు. తన పై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని స్పీకర్ ను కోరారు.
తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామన్నారు జగదీశ్రెడ్డి. 2014 జూన్ 2 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తులు రూ.44,434 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. 2014 జూన్ 2 నాటికి రూ.22,423 కోట్ల అప్పులు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం విద్యుత్ రంగం ఆస్తులు రూ.1,37,570 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం రూ.81,516 కోట్లు అప్పులు ఉన్నాయని ప్రకటించారు.
జగదీశ్ రెడ్డి సవాల్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు. మూడు అంశాలపై విచారణ చేయిస్తామన్నారు. విద్యుత్ రంగంపై వాస్తవాలు చెప్పిన ఓ ఉద్యోగి హోదాను గత ప్రభుత్వం తగ్గించిందని సభలో వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురకైన పాత్ర పోషించిన ఆ ఉద్యోగిని విద్యుత్ రంగంపై వాస్తవాలు చెప్పినందుకు మారుమూల ప్రాంతాన్ని బదిలీ చేశారని తెలిపారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందన్నారు.