KCR Convoy : మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాలను వెల్లడించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 66 కోట్ల రూపాయలతో 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి వాటిని విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ విషయాన్ని తాను సీఎం అయిన పది రోజుల వరకు కూడా తెలియదన్నారు. అయితే ఓ అధికారి చెప్పడంతో ఈ కాన్వాయ్ కొనుగోలు గురించి తెలిసిందని రేవంత్ రెడ్డి వెల్లడించడం అందరిని షాక్ కి గురి చేసింది.
మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉండగా తన కాన్వాయ్ కోసం 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి వాటికి బులెట్ ఫ్రూఫ్, శాటిలైట్ టెక్నాలజీ హంగులు.. చేయించేందుకు ఏపీలో గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని త్రిహయని ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సీక్రెట్గా తరలించారు. అయితే ఊహించని రీతిలో ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవ్వడంతో ఆ విషయాన్ని గుట్టుచప్పుడుగా ఉంచారు. అయితే జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ ఆయన పొరుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు ఈ స్పెషల్ కాన్వాయ్ ను దాచిపెట్టారని భావిస్తున్నారు.
ఈ కాన్వాయ్ వ్యవహరంపై విచారణ చేపట్టిన అధికారులు.. త్వరలోనే సంబంధిత వివరాలను బయటపెట్టేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఆ అంశంపై ఏపీలోని అధికారులతో కూడా మాట్లాడి సదరు కంపెనీ ప్రతినిధితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కార్లను హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారని సమాచారం అందుతుంది.