CM Revanth Challenge to Harish Rao: రాష్ట్రంలో వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేస్తున్న మాజీమంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమించుకున్న కాల్వలను తొలగించాలని డిమాండ్ చేసే సత్తా ఉందా అని ప్రశ్నించారు రేవంత్. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీష్ రావుకు.. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో పూర్తి అవగాహన ఉందని, ఆ అవగాహనతోనే పువ్వాడ అజయ్ ఆక్రమణలను తొలగించేందుకు చిత్తశుద్ధితో సహకరిస్తారా ? అని అడిగారు. సహకరిస్తానంటే.. అధికారులను పంపిస్తానని తెలిపారు సీఎం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాక.. తమ ప్రభుత్వ చిత్తశుద్ధి గురించి ప్రశ్నించాలన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 24 గంటలు అప్రమత్తంగా ఉండి.. వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. రెండ్రోజులుగా తాను కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గడిచిన పదేళ్లలో వచ్చిన వరదల్లో మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరోజైనా వరద బాధితుల్ని ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయా ? ఏ ప్రమాదంలో ప్రజలు చనిపోయినా బయటికి వచ్చారా ? అని ప్రశ్నించారు. ఒకవేళ ప్రజలను కలిసి ఉంటే.. అందుకు సంబంధించిన ఆధారాలను చూపాలని డిమాండ్ చేశారు.
Also Read: బీఆర్ఎస్ నేతల ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత.. వాహనాలపై రాళ్లదాడి
కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే పసిపిల్లలు చనిపోతే పరామర్శించలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మానవత్వం లేని సీఎంగా ఆయన పదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చిందని, తక్షణ సాయంగా పదివేల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు.