Nampally Alai Balai : ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్’లో మాజీ కేంద్రమంత్రి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని అత్యంత గొప్పగా చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉదృతమైన సమయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు 2005లో అలయ్ బలయ్ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఆనాటి నుంచి అలయ్ బలయ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈసారి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుయ్యారు. అలయ్ బలయ్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, గవర్నర్ దత్తత్రేయ కుమార్తె అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 2024 దసరా సమ్మేళనం ఘనంగా జరిగింది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఢంకా మోగించారు. ఇక మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అలయ్ బలయ్ ను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో గిరిజన నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, సంప్రదాయ నృత్యాలు, కోలాటం, పులి వేషాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేశారు.
దేశంలోనే టాప్ ప్లేస్ కు రావాలి…
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసిమెలసి అభివృద్ది కోసం పరస్పరం పని చేయాలని గవర్నర్ దత్తాత్రేయ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవాలన్నారు. ఐకమత్యంతో ముందుకెళ్లాలని, దేశంలోనే తెలుగు రాష్ట్రాలను అగ్రభాగాన నిలపాలని కోరారు. 2005లో రాజకీయాలకు సంబంధం లేకుండా, ప్రేమ, ఆప్యాయత, అనురాగాల కోసం అలయ్ బలయ్ ను ప్రారంభించామన్నారు. ప్రేమ, ఆత్మీయత, ఐక్యతను చాటుకోవాలన్నదే అలయ్ బలయ్ లక్ష్యమన్నారు.
కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు. వారిలో ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు పగాడే, మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయ శంకర్ లు ఉన్నారు.
కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, తెలంగాణ వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ బీబీపాటిల్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ , ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, కోట శ్రీనివాసరావు, ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
అలా చేయడం మంచిదికాదు…
తోటివారి ఆలోచనలను, భావాలను గౌరవించటం కూడా ఐక్యత కిందకే వస్తుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య అన్నారు. అందరినీ ఒకే వేదిక మీద చూడటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలకు లిమిట్ ఉంటుందని, అది కేవలం సిద్ధాంతాల వరకే పరిమితమవ్వాలన్నారు. నేతలు వ్యక్తిగత దూషణలు చేస్తే కార్యకర్తలు కూడా అలాగే ప్రవర్తిస్తారన్నారు. దీంతో సమాజానికి చెడు జరుగుతుందన్నారు. ఐక్యతా, సమష్టి కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
జేఏసీ ఆవిర్భవానికి ఇదే మూలం…
తెలంగాణ జేఏసీ ఆవిర్భవించిందంటే అందుకు అలయ్ బలయ్ కూడా ఒక కారణంగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు అంతా ప్రత్యేక తెలంగాణ కోసమే ఉద్యమం బాట పట్టాయన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని గొంగళితో సన్మానించారు. దత్తాత్రేయ వారసత్వాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు.
హైదరాబాదీ, తెలంగాణ స్టైల్ ఘుమఘుమలు…
ఇక అలయ్ బలయ్ కార్యక్రమ అతిథులకు స్పెషల్ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఘుమఘుమలాడే, నోరూరించే తెలంగాణ వంటలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. అతిథులందరికీ శాఖాహార, మాంసాహార వంటకాలను రెఢీ చేశారు.
నోరూరించే తెలంగాణ సంప్రదాయక వంటకాలు చికెన్, మటన్ బిర్యానీ, చేపల పులుసు, చిరు ధాన్యాల ఉత్పత్తులు, జొన్న రొట్టె, సర్వపిండి, ఇతర పిండి వంటకాలు, గారెలు, బూరెలు సిద్ధం చేశారు. ఇవే కాకుండా బోటి, తలకాయ కూర, చేపల వేపుడు, చికెన్ వేపుడు, నల్ల, పాయ వంటి 60 రకాల స్పెషల్ వంటకాలను ఏర్పాటు చేసినట్లు కమిటీ వెల్లడించింది.
Also Read : హరీష్రావుకు మంత్రి కౌంటర్.. ఆనాడేమైంది? అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా?