Singareni Workers Dasara Bonus: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం లాభాలను పంచుతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదన్న ఆయన.. దసరా కంటే ముందో కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నామన్నారు. ఉద్యమాన్ని సింగరేణి గని కార్మికులు పతాకస్థాయికి తీసుకెళ్లారన్నారు. గతేడాది సంస్థ పొందిన లాభాల్లో వాటా పంచుతున్నట్లు తెలిపారు. వారి కుటుంబాల్లో ఆనందం చూడాలన్న ఉద్దేశ్యంతోనే బోనస్ ప్రకటించాలని డిప్యూటీ సీఎం భట్టి ప్రతిపాదన తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఒక్కో కార్మికుడికి రూ.లక్ష 90 వేలు బోనస్ గా ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గతేడాది లక్షా 70 వేల రూపాయలు ఇవ్వగా.. ఈ ఏడాది ఒక్కో కార్మికుడికి రూ.20 వేలు అదనంగా బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోనే కాకుండా.. ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గును ఉత్పత్తి చేస్తూ సింగరేణి సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా పంచడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సంతోషంగా ఉందన్నారు భట్టి విక్రమార్క. రూ.796 కోట్లను సింగరేణి కార్మికులకు బోనస్ గా ఇస్తున్నట్లు వివరించారు. 41,837 మంది పర్మినెంట్ ఎంప్లాయిస్ ఉండగా.. కాంట్రాక్ట్ వర్కర్లుగా 25 వేల మంది ఉన్నారన్నారు. మొట్టమొదటిసారి కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కు కూడా ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున బోనస్ పంచుతున్నట్లు తెలిపారు.