CM Revanth Reddy Inaugurated Indiramma House Scheme: యాదగిరిగుట్ట, భద్రాద్రి జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టకు చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారందరికీ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఆలయ పండితులు ఆశీర్వచనం అందజేశారు. మర్యాదపూర్వకంగా సన్మానించి.. స్వామివారి చిత్రపటాన్ని తీర్థ, ప్రసాదాలను అందించారు.
సీఎం హోదాలో మొదటి సారిగా భద్రాచలంకు విచ్చేసిన రేవంత్ రెడ్డి.. మొదటిగా సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు సీఎం, మంత్రులకు ఆశీర్వచనం చేసి.. తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు.
స్వామివారి దర్శనం అనంతరం భద్రాచలం వ్యవసాయ మార్కెట్ సముదాయంలో జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నమూనాను ఆవిష్కరించి, పథకాన్ని ప్రారంభించారు.
Read More: బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్.. హైదరాబాద్లో బయటపడ్డ గలీజ్ దందా…
అందులో భాగంగానే అర్హులైన వివిధ గ్రామీణ ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ ఆర్డర్, ఇందిరమ్మ ఇండ్ల గృహ నమూనా జ్ఞాపికను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవంతో బ్రతకాలన్న ఉద్దేశంతోనే ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ కు – ఖమ్మం జిల్లాకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అందుకే ఈ పథకాన్ని ఖమ్మంజిల్లాలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ.. మహిళల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందిస్తామని తెలిపారు. రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టారు. నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీఎం తెలిపారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయదని తెలిపారు. కేసీఆర్ పేదల కలలతో ఓట్ల వ్యాపారం చేశారని దుయ్యబట్టారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గోదావరి ముంపు ప్రాంతాలు ఇకపై ముంపునకు గురికాకుండా రూ.500 కోట్ల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా మణుగూరులోని ముత్యాలమ్మ నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రజాదీవెన సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి భద్రాద్రి జిల్లాకు రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున సభా ప్రాంగణానికి చేరకుంటున్నారు.
ప్రజాదీవెన సభకు 40 వేల మందికి పైగా ప్రజలు రానుండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణం భారీ కటౌట్లతో ముస్తాబయింది. ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో భారీ టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. ప్రజలు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.