CM Revanth Delhi Tour: ఢిల్లీ టూర్ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి రెండు రోజులు బిజీ.. బిజీగా గడిపారు. తొలి రోజు రాష్ట్ర పునర్విభజన చట్టం సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను, హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్థి మంత్రి హర్షదీప్ సింగ్ పురీతో సమావేశమై చర్చించారు. రెండో రోజు కూడా అదే బిజీ.. బిజీగా గడిపిన సీఎం రేవంత్.. పలువురు కేంద్ర మంత్రులను కలిసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా.. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నామన్నారు సీఎం రేవంత్. ఈ ప్రక్షాళనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహాయం కావాలని కోరారు. మంత్రి ఉత్తమ్తో కలిసి.. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ, కార్యదర్శి శశిరంజన్ కుమార్తో గంటన్నర పాటు భేటీ అయ్యారు రేవంత్. యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సహకారం కావాలని కోరారు. యూపీఎస్సీలో పారదర్శకత, అవినీతి మరక లేకుండా ఇంత సుదీర్ఘ కాలం పాటు అత్యంత సమర్థవంతంగా పని చేయడంపై సీఎం ఆరా తీశారు. వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన యూపీఎస్సీ నిర్దిష్ట కాలపరిమితిలోనే నోటిఫికేషన్లు జారీ చేయడం, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, నియామక ప్రక్రియను చేపట్టడం.. అన్నింటా పారదర్శకత పాటించడం అభినందనీయమన్నారు రేవంత్.
టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ అడుగుజాడల్లోనే తీర్చిదిద్దాలని భావిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలను కూడా రాజకీయం చేసిందని.. దాన్నో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని.. ఆ కారణంగానే వరుసగా పేపర్ లీకులు జరిగాయన్నారు. TSPSC ఆధ్వర్యంలో జరిగిన నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి మొత్తం ఒక ప్రహసనంలాగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్.
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఏర్పడితే, కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా నియామకాల లక్ష్యం నెరవేర్చడంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఛైర్మన్, సభ్యుల నియామకం చేపట్టాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. TSPSCలో అవకతవలకు తావు లేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నూతన విధానాలు, పద్థతులను పాటించాలని భావిస్తున్నట్లు తెలిపారు. నియామకాల ప్రక్రియపై.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దృష్టి సారించడం అభినందనీయమని ప్రశంసించారు యూపీఎస్సీ చైర్మన్.
యూపీఎస్సీలోనూ చైర్మన్, సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయానికి తావు ఉండదన్నారు. సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని.. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర కమిషన్లో చైర్మన్తోపాటు సభ్యులందరికీ శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించారు యూపీఎస్సీ చైర్మన్. టీఎస్పీఎస్సీ సచివాలయ సిబ్బంది కూడా అవగాహన తరగతులు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలసీతారామన్తో సమావేశమైన సీఎం రేవంత్రెడ్డి నిధులు విడుదలపై విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్థి కింద కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు 1800 కోట్లు విడుదల చేయాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావాల్సిన 2 వేల 233 కోట్లు త్వరగా విడుద ల చేయాలన్నారు. హైదరాబాద్ నగర అభివృద్థికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్లో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని.. ఇందుకోసం అక్కడ ఉన్న రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ కొద్ది భాగం తప్ప మిగతా స్కైవే పూర్తయిందన్నారు. రక్షణ మంత్రి అందుకు సుముఖత వ్యక్తం చేశారు.
రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి అవుటర్ రింగు రోడ్డు జంక్షన్ వరకు 11 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి బదిలీ చేయాలని కోరారు సీఎం రేవంత్. నాగ్పూర్ హైవేపై ప్యారడైజ్ జంక్షన్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు 18 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించామని.. 12 కిలోమీటర్ల పొడవున ఉన్న 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని కోరారు. రాష్ట్రంలో సైనిక పాఠశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్రెడ్డి.