CM KCR: అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలలు ముందుగానే అభ్యర్థులకు ప్రకటించి కాక రేపారు కేసీఆర్. మాగ్జిమమ్ సిట్టింగులకే మళ్లీ టికెట్లు ప్రకటించారు. స్వయంగా కేసీఆర్ సైతం రెండు స్థానాల్లో పోటీకి దిగుతున్నారు. ఈ క్రమంలో.. పలువురు బలమైన నేతలకు హ్యాండ్ ఇవ్వక తప్పలేదు. మరి, వారంతా సర్దుకుపోతారా? తిరగబడతారా? రెబెల్గా తొడకొడతారా? అనే టెన్షన్ మాత్రం ఉంది.
రాజకీయ చాణక్యుడు కేసీఆర్కు.. అలాంటి వారిని ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. అందుకే, హుటాహుటిన కేబినెట్ విస్తరణ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారని అంటున్నారు. అదేంటి? ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించాక.. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఏంటి? అని అంతా అవాక్కవుతున్నారు.
నిజమో.. ప్రచారమో కానీ.. మంగళవారమే కేబినెట్ విస్తరణ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈటల బర్తరఫ్ తో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
సిట్టింగులకే టికెట్లలో భాగంగా.. తాండూరు నుంచి మళ్లీ పైలెట్ రోహిత్రెడ్డికే ఛాన్స్ ఇచ్చారు గులాబీ బాస్. అసలే ఆపరేషన్ ఆకర్ష్ను వికర్ష్గా మార్చిన లీడర్ ఆయన. మరి, రోహిత్రెడ్డికి సీటిస్తే.. సీనియర్ నేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ఊరుకుంటారా? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే బలమైన నాయకుడైన పట్నంను కాదని.. కారు ముందుకు లాగించగలదా? అందుకే, పట్నం మహేందర్రెడ్డి అలగకుండా.. గోడ దూకకుండా.. కాపాడుకోవడానికే అన్నట్టు.. ఆయన్ను మంత్రిని చేసే ప్రపోజల్ తీసుకొచ్చారు కేసీఆర్. మరి, నాలుగు నెలల ముచ్చటకు పట్నం పడిపోతారా? తగ్గేదేలే అని గులాబీ బాస్పై తొడగొడతారా?
అటు ప్రస్తుతమున్న మంత్రిమండలి నుంచి మరొకరికి ఉద్వాసన పలికి.. ఆ స్థానంలో గంప గోవర్ధన్ ను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కోసం తన సీటును గంప గోవర్ధన్ త్యాగం చేశారు. అందుకు రిటర్న్ గిఫ్ట్గా మంత్రిపదవి ఇవ్వబోతున్నట్టు టాక్. అట్లుంటది కేసీఆర్తోని.