CM KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అసెంబ్లీ టికెట్లు ప్రకటించారు. 115 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. మాగ్జిమమ్ సిట్టింగులనే ఖరారు చేశారు. అయితే, కొన్ని సీట్లలో మాత్రం మార్పులు తప్పలేదు. ఏడుచోట్ల అభ్యర్థులకు షాక్ ఇచ్చారు గులాబీ బాస్.
వేములవాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు టికెట్ దక్కలేదు. పౌరసత్వం కేసుల దృష్ట్యానే ఆయనకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పారు.
కోరుట్లలోనూ సిట్టింగ్ కేండిడేట్ విద్యాసాగర్ రావుకు అనారోగ్యం కారణాల వల్ల టికెట్ ఇవ్వట్లేదని.. ఆయన కోరిక మేరకు విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్ సంజయ్ని అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు తెలిపారు.
బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, వేములవాడ, ఉప్పల్, స్టేషన్ ఘనపూర్లో అభ్యర్థులను మార్చుతున్నట్టు ప్రకటించారు. స్టేషన్ ఘనపూర్లో తాటికొండ రాజయ్యకు షాక్ ఇచ్చారు కేసీఆర్. మరో సీనియర్ నేత కడియం శ్రీహరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశారు.
ములుగు నుంచి నాగజ్యోతిని అభ్యర్థిగా సెలెక్ట్ చేశారు. కంటోన్మెంట్ నుంచి సాయన్న కూతురు లాస్య నందినిని ఎంపిక చేశారు. హుజురాబాద్ నుంచి అనుకున్నట్టుగానే కౌశిక్ రెడ్డిని సెలెక్ట్ చేశారు. దుబ్బాక నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఉప్పల్ బరిలో బండారి లక్ష్మారెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు.
నాలుగు స్థానాల్లో మాత్రం కేండిడేట్స్ను పెండింగ్లో పెట్టారు గులాబీ బాస్. నర్సాపూర్, గోషామహల్, నాంపల్లిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక, గత కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో రచ్చ నడుస్తున్న జనగామ స్థానాన్ని సైతం హోల్డ్లో ఉంచారు. దీంతో.. టికెట్ ముత్తిరెడ్డికా? పల్లాకా? లేదంటే, పోచంపల్లికా అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.