రాజకీయ పావులు కదపడంలో సీఎం కేసీఆర్ దిట్ట. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే.. ఎలాంటి లాభం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. అసలే ఎన్నికల సమయం. ఈసారి ఎలాంటి సంచలనాలకు తెరతీస్తారోనని అంతా అనుకుంటుండగానే.. ఎలక్షన్ల కోసం తొలి అస్త్రాన్ని బయటకు తీశారు సీఎం కేసీఆర్. అదే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ తీర్మానం చేసింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టనున్నట్టు ప్రకటించారు మంత్రి కేటీఆర్. విధివిధానాల రూపకల్పనకు సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సర్కార్ నిర్ణయంతో ఏకంగా 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. మామూలు నిర్ణయమా ఇది?
గురి చూసి కొట్టారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ ఉద్యోగులది ఎప్పుడూ దీన గాథే. చాలీ చాలని జీతాలు. వేళాపాళాలేని ఉద్యోగాలు. జీతాల పెంపు కోసం కొన్నేళ్ల క్రితం పెద్ద పోరాటమే చేశారు. వారాల తరబడి ఉద్యమించారు. నెలల పాటు బస్సులు బంద్ చేశారు. కేసీఆర్ పంతానికి పోయారు. ఉద్యమం విరమిస్తేనే.. చర్చలంటూ ఉద్యోగులకు చుక్కలు చూపించారు. కోర్టు చెప్పినా వినలేదు. వారి జీవితాలతో ఆడుకొని.. ఓ నిండుప్రాణం పోయాక.. చర్చల పేరిట వారికి తాయిలాలు విసిరారు. తనదైన మాటల గారడీతో.. ఆర్టీసీని అదిచేస్తా, ఇదిచేస్తానంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. ఉద్యోగులకు కాస్త జీతం పెంచి వారితో తన ఫోటోలకు పాలాభిషేకం చేయించుకున్నారు. అయినా, నో యూజ్. ఆర్టీసీ కోలుకున్నది లేదు. బాగుపడింది లేడు. ఇలాంటి సమయంలో సడెన్గా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకోవడం ఊహించని షాకింగ్ న్యూసే.
ఏం జరిగింది? ఎవరు అడిగారు? ఎందుకు ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకున్నారు? అనే చర్చ మొదలైంది. గతంలో ఆర్టీసీ ఉద్యమం వెనుక అప్పటి మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారనే అక్కస్సుతో.. వారి సమ్మెను ఉక్కుపాదాలతో అణిచివేసిన కేసీఆర్.. ఇప్పుడు ఉన్నపళంగా వారందరినీ అక్కున చేర్చుకుంటూ.. ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించడం సంచలనమే అంటున్నారు. కేసీఆర్ ఏం చేసినా.. దానికో లెక్కా, లాభం ఉండి తీరుతుంది. ఆ లెక్కన చూస్తే….
ఆర్టీసీ కార్మికులు తమకు కాసింత జీతం పెంచితే అదే చాలు అనుకునే దీన స్థితిలో ఉండేవారు. అలాంటిది అనూహ్యంగా 43 వేలకు పైగా ఆర్టీసీ సిబ్బందిని.. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తే! వారి జీవితంలో ఊహించలేని విషయం ఇది. అది సీఎం కేసీఆర్ చేసి చూపించబోతున్నారు. ఇంకేం. వారంతా ఆయన్ను నెత్తిన పెట్టుకోరూ? 43వేల కుటుంబాలు.. ఒక్కో కుటుంబంలో ఆరుగురిని వేసుకున్నా.. రెండున్నర లక్షల మందికి నేరుగా గుడ్న్యూస్. ఇక నిత్యం బస్సుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. వాళ్లందరికీ ఆ బస్సు డ్రైవరో, కండెక్టరో.. కేసీఆర్ గురించి గొప్పగా చెప్పరూ. ఆయన మా దేవుడంటూ కీర్తించరూ. అలా ఒక్కో ఆర్టీసీ ఉద్యోగి.. వచ్చే ఎన్నికల నాటికి ఎంతమందిని కేసీఆర్కు ఓటు బ్యాంకుగా మార్చే అవకాశం ఉందో లెక్కేసుకోవచ్చు. ఈ లెక్క ప్రకారమే.. ఎవరూ అడగకుండానే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ప్రగతి చక్రంతో.. రాజకీయ చక్రం తిప్పేశారు సీఎం కేసీఆర్ అంటున్నారు.
ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. మంత్రి కేటీఆర్ చివర్లో ఓ ఇంట్రెస్టింగ్ డైలాగ్ కూడా వదిలారు. అన్ని పటాసులు ఒకేరోజు కాలుస్తామా ఏంటి? అంటూ అసలైన పొలిటికల్ టపాసు పేల్చారు. అంటే, కేసీఆర్ అమ్ములపొదిలో ఇలాంటి మరిన్ని స్కీములు, స్కెచ్లు ఉన్నాయన్నట్టేగా? కమాన్ గుస గుస.