తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల సమయమే ఉంది. దీంతో వరాల జల్లు కురిపిస్తున్నారు సీఎం. 19వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించేశారు. కానీ ఖజానాలో చూస్తే నిధులు నిండుకుంటున్న పరిస్థితి. మరి డబ్బులు ఎలా? ప్రభుత్వ ఉద్యోగులకు 15తేదీ వచ్చినా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ, 19వేల కోట్ల రుణమాఫి ఎలా?
45 రోజుల్లో 19 వేల కోట్ల రుణమాఫీ సాధ్యమయ్యే పనేనా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే 2018 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఇది. బడ్జెట్ పెట్టినా.. ఆర్థిక శాఖ నిధులు సర్దుబాటు చేయలేకపోవడంతో ఇంత వరకూ వచ్చింది. నిజానికి ఇప్పుడు కూడా ప్రభుత్వ ఖజానా గలగల ఏమీ లేదు. అడపాదడపా ఐదున్నర లక్షల మంది రైతులకు 1,206 కోట్లు మాఫీ చేసినా.. అవి బ్యాంకు వడ్డీలకు కూడా సరి పోలేదు. ఇంకా సుమారుగా 31 లక్షల మంది రైతులకు 20,351 కోట్ల మేర మాఫీ చేయాల్సి ఉంది. ప్రతి నెలా రాష్ట్ర ఖజానాకు 12వేల కోట్ల దాకా ఆదాయం వస్తోంది. ఇందులో ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు కలిపి నెలకు 4 వేల కోట్లు అవసరమవుతాయి. అవి పోను మిగితా నిధులు జమ చేసినా ఈ 45 రోజుల్లో 20 వేల కోట్లు జమ కావు. అయితే వీలైనంతగా తొందరగా నిధులు సమీకరించేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు ముుమ్మరం చేసింది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా లిక్కర్ టెండర్లను పిలిచారంటున్నారు.
ఈ ఏడాది నవంబరు చివరి నాటికి ప్రస్తుత వైన్స్ లైసెన్స్దారుల గడువు ముగుస్తుంది. డిసెంబరులో ఎన్నికలు కావడంతో ఫిబ్రవరి వరకు తమకు ఎలాంటి ఢోకా లేదన్న ధీమాలో లైసెన్స్దారులు ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆదాయం రాదన్న ఉద్దేశంతో ముందుగానే టెండర్లు పిలిచింది. ప్రస్తుత దుకాణాలకు ఫీజులు చెల్లించడంతోపాటు, కొత్త దుకాణంకోసం మూడు నెలలు ముందుగా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. వీటికి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు 2 లక్షలు అదనం. లాటరీలో షాపులు దక్కించుకున్న వారు ఈనెల 21, 22 తేదీల్లో అంటే 3 నెలల ముందుగానే తొలి వాయిదా ఫీజును ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ లెక్కన ఇదే నెలలో 2 వేల కోట్ల రూపాయలు లిక్కర్ టెండర్ల ద్వారా రాబట్టే ప్లాన్ తో ప్రభుత్వం ఉంది.
మరోవైపు భూముల అమ్మకం జోరుగా కొనసాగుతోంది. కోకాపేట నియోపొలిస్ లో HMDA వేలం నిర్వహించగా.. అత్యధికంగా ఎకరం భూమి 72 కోట్ల రూపాయలు పలికింది. మొత్తం 7 లాండ్ పార్సిల్స్ వేలానికి పెట్టారు. కోకాపేటలో గత వేలంలో 49 ఎకరాల్లో ప్లాట్లు వేలం వేస్తే 2 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు కూడా 2500 కోట్ల దాకా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు నోటరీ భూముల రిజిస్ట్రేషన్ కు పచ్చజెండా ఊపింది సర్కార్. అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. 125 గజాలకు పైగా ఉన్న ప్లాట్లకు స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తారు. అంటే ఈ రెగ్యులరైజేషన్ తో సర్కార్ కు 5 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు.
ఇలా అన్నిమార్గాల్లో మాగ్జిమమ్ పైసా వసూల్ చేసి.. ఆ సొమ్ముతో అతికష్టం మీద రుణమాఫీ ఇచ్చేసి.. మరోసారి రైతులందరినీ గంపగుత్తగా గులాబీ ఓటు బ్యాంకుగా మార్చేసుకోవాలనేది కేసీఆర్ లెక్క. ఆ లెక్క కోసమే ఈ లెక్కల తిప్పలు.