KCR Meetings : ముఖ్యంత్రి కేసీఆర్ సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. భూపాలపల్లిలో శుక్రవారం నాడు కేసీఆర్ ప్రజాశీర్వాద సభలో కనిపించిన ఈ సీన్ చర్చకు తావిచ్చేలా మారింది. మామూలుగా అయితే ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు కేసీఆర్ ప్రసంగం కొనసాగించరు. అవసరమైతే చిర్రెత్తుకొచ్చి నాలుగు తిట్లు తిట్టి వెళ్లిపోతారు. కానీ.. ఎన్నికల టైమ్ కావడం వల్ల ఎక్కడా విషయం వైరల్ అవకుండా జాగ్రత్త పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో తూతూ మంత్రంగా ప్రసంగం కానిచ్చి వెళ్లిపోయారు. సీఎం కేసీఆర్ సభలో జనం కనిపించలేదు. వచ్చిన కొంత మంది కూడా ప్రసంగం పూర్తి కాకముందే కుర్చీల్లోంచి లేచి వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీలు వెక్కిరించడంతో సీఎం కేసీఆర్ అసహనానికి గురయ్యారు. పట్టుమని పదంటే పది నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించేశారు. చురుక్కులు, చమక్కులు లేకుండానే సర్ధుకోవడం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీసేలా చేసింది.
ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్లాన్ చేసిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ రద్దైంది. వాతావరణం సహకరించకపోవడంతోనే సభ రద్దు నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే అసలు కారణం వేరే అనే టాక్ నడుస్తోంది. పరేడ్ గ్రౌండ్స్ సభ కోసం బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. మహానగరంతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి పెద్దఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేశారు నేతలు. అయితే చివరి నిమిషంలో రద్దుకు కారణాలపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. భారీగా జన సమీకరణ చేయలేమనే హ్యాండ్సప్ అన్నారనే టాక్ నడుస్తోంది. భూపాలపల్లి సభ ఫ్లాప్ దెబ్బకు కేసీఆర్ ఏకంగా సభలకు ముగింపు పలికినట్లు కనిపిస్తోంది. సభలకు జనం రాకపోవడం వల్ల వర్షాల పేరుతో కవర్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు కాంగ్రెస్ సభలు.. ప్రియాంక, రాహుల్ టూర్స్, అమిత్షా రోడ్షోలతో ప్రచారం హోరెత్తుతోంది. మరి సభలు అన్నీ జరుగుతుంటే.. పరేడ్ గ్రౌండ్స్ సభ మాత్రం క్యాన్సిల్ చేయడం వెనక జనం రావడం లేదనే వాదనలకు బలం చేకూరుస్తోంది. సభ ఫ్లాప్ అయితే పోలింగ్కు నాలుగు రోజుల ముందు మొత్తానికే ఎసరు వస్తుందని బీఆర్ఎస్ భయంగా కనిపిస్తోంది. ఇక కేసీఆర్ కూడా రోడ్ షోలకే పరిమితం కానున్నారని తెలుస్తోంది.
హైదరాబాద్లో ఇప్పటి వరకు కేసీఆర్ సభలు ఇలా ఏదో ఓ సాకు చెబుతూ రద్దు చేయడం బీఆర్ఎస్కు పరిపాటిగా మారింది. ఈసారి కూడా వర్షం సాకుగా చెబుతున్నా భూపాలపల్లి ఎఫెక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తోంది. కేసీఆర్ ప్రసంగాలు గతంతో పోలిస్తే పూర్తిగా చప్ప బడిపోయాయి. 10 ఏళ్లలో చెప్పుకోవడానికి ఏం లేకుండా పోయింది. అధికారంలో ఉండి కూడా చేసింది ఏం లేదు. నీళ్లు, నిధులు, నియామకాల అమలు అట్టర్ ఫ్లాప్ అయింది. మేడిగడ్డ కుంగిపోవడం కాళేశ్వరం గొప్పలకు బ్రేక్ పడేలా చేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీలు నిరుద్యోగుల ఆగ్రహానికి కారణమైంది. నిధులు లేక ఇచ్చిన హామీలు అమలు చేయలేదని తేలిపోయింది. ఇక మిగిలిందల్లా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడమే.. అన్ని సభల్లోనూ కరెంటు, కర్ణాటక అంటూ కేసీఆర్ అరిగి పోయిన రికార్డు వేశారు. ఇది కాస్తా జనం అసహనానికి దారితీసింది. కేసీఆర్ సభలకు డబ్బులిచ్చినా వెళ్లడమే వేస్ట్ అనేలా పరిస్థితులు మారిపోయాయి. అందుకే సభలు కాకుండా రోడ్ షోలకు గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
2019 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా బీఆర్ఎస్ ఇలాగే వ్యవహరించింది. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేసి జనం రాకపోవడంతో చివరి నిమిషంలో సభలు రద్దు చేసింది. GHMC ఎన్నికల్లోనూ ఇలాగే గులాబీ పార్టీ చేతులెత్తేసింది. ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన కేటీఆర్.. ముగింపు సభ కేసీఆర్తో ఉండేలా ప్లాన్ చేశారు. అయితే జన సమీకరణ కష్టం కావడం వల్ల క్యాన్సిల్ చేశారు. దీన్ని కవర్ చేస్తూ గులాబీ నేతలు ప్రగతిభవన్లో కేసీఆర్ ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తారనే వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్, హరీష్రావుతో కలిసి కేసీఆర్ వ్యూహాలు రచిస్తారట. అంటే ప్రగతి భవన్ కేంద్రంగా ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలనే కుట్రలు చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.