KCR: యాదాద్రి సూపర్ గా డెవలప్ చేశారు. చూసిన వారంతా అబ్బురపడుతున్నారు. వారెవా యాదాద్రి.. వారెవా కేసీఆర్ అంటూ కితాబు ఇస్తున్నారు. తెలంగాణకు వచ్చే జాతీయ ప్రముఖులందరినీ యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. యాదాద్రి పునర్నిర్మాణం.. సీఎం కేసీఆర్ కు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ఆ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్న కేసీఆర్.. తాజాగా కొండగట్టు అంజన్న ఆలయంపై దృష్టి సారించారు. కొండగట్టును దేశంలోనే ప్రముఖ హానుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దేలా నిధుల వరద పారించారు.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలను హెలికాప్టర్ ద్వారా ఆకాశం నుంచి పరిశీలించారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధిపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే బడ్జెట్ లో 100 కోట్లు ప్రకటించగా.. తాజాగా మరో 500 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 600 కోట్లతో కొండగట్టు ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మాణం చేయాలని ఆదేశించారు.
850 ఎకరాల్లో కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ప్రమాదాలకు తావులేకుండా సురక్షితమైన ఘాట్ రోడ్డును నిర్మించనున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. యాదాద్రికి డిజైన్లు అందించిన ఆనంద్ సాయినే.. కొండగట్టు ఆలయ పునర్ నిర్మాణ నమూనాను రూపొందించనున్నారు.
హైదరాబాద్ సమీప యాదాద్రి ఆలయం తర్వాత.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కొండగట్టు అంజన్న ఆలయంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. కొండగట్టు కంటే ముందుగానే వేములవాడ ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చి.. 100 కోట్లు కూడా ప్రకటించారు. కానీ, వేములవాడను పక్కనపెట్టేసి.. సడెన్ గా కొండగట్టు అంజన్న సేవలో తరిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ తన వారాహికి ఇక్కడే పూజ చేయించడం.. పవన్ కు కొండగట్టు సెంటిమెంట్ బాగా ఉండటంతో రాజకీయంగా ఈ ఆలయం పేరు ఇటీవల మారుమోగిపోయింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలామంది భక్తులకు కొండగట్టుతో అనుబంధం ఉంది. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని.. ప్రముఖ క్షేత్రంగా మార్చే ప్రయత్నం చేస్తుండటం రాజకీయంగానూ కలిసివచ్చే అవకాశం ఉందని అంటున్నారు.