ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. కేసీఆర్ అభ్యర్థుల లిస్టు ప్రకటించడంతో అసంతృప్తి సెగలు చెలరేగడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఖమ్మంలో తుమ్మల వ్యాఖ్యలు మరింత కాకరేపుతుండటంతో జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఫోకస్ పెట్టారు గులాబీ బాస్. ఖమ్మం జిల్లా పార్టీ నేతలతో సాయంత్రం సీఎం కేసీఆర్ సమావేశంకానున్నట్టు తెలుస్తోంది. తుమ్మల అంశంపై ఏదో ఒకటి ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పాలేరు నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు. టికెట్ రాకపోవడంతో ఆవేదనకు గురైన తుమ్మల.. పెద్ద ఎత్తున బలప్రదర్శనకు దిగారు. అభిమానులతో మీటింగ్ పెట్టి తాను తప్పకుండా ఎన్నికల బరిలో దిగుతానంటూ ప్రకటించారు. దీంతో తుమ్మల కారు దిగేసి.. కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
బలమైన నేత తుమ్మల పార్టీని వీడితే.. ఖమ్మంలో బీఆర్ఎస్ పరిస్థితి కంగారే. ఇప్పటికే పొంగులేటి పోయారు. ఇప్పుడు తుమ్మల కూడా పోతే..? కారు ముందుకు కదిలేనా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో ఒక్క సీటే వచ్చింది. ఈసారి అదైనా వస్తుందా? అనే టెన్షన్లో ఉన్నారట కేసీఆర్.