CM KCR latest speech(Political news today telangana): లక్ష కోట్ల అవినీతి అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఖర్చే తప్ప ప్రయోజనం లేని వైట్ ఎలిఫెంట్ అని కాంగ్రెస్ అంటోంది. రూ.10 ఖర్చు పెడితే రూ.1 ఆదాయం కూడా వచ్చే అవకాశం లేదని నిపుణులు తప్పుబడుతున్నారు. కేసీఆర్కు ఏటీఎంలా మారిందని బీజేపీ వాదన. ఇలా లోకమంతా కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం లేటెస్ట్గా ఓ సంచలన విషయం చెప్పారు. 80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు ఎప్పుడో వచ్చేసిందని బ్రేకింగ్ న్యూస్ వెల్లడించారు.
ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎంత వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా అమాయకపు ప్రశ్నలు అడగొద్దు మరి. కేసీఆర్ వచ్చిందన్నారు కాబట్టి.. వచ్చేసింది అంతే..అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. కాళేశ్వరం ఖర్చు ఎలా వసూల్ అయిందో కేసీఆర్ చెప్పిన లెక్క చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాలువలకు నీళ్లు వచ్చాయి.. భూగర్భ జలాలు పెరిగి బోర్లు బాగా పని చేశాయి.. వాటితో రైతులు కుప్పలు తెప్పలుగా పంట పండించారు. ఆ పంట అమ్మిన సొమ్ముతో రైతన్నలు బాగుపడుతున్నారు. వాళ్ల ఆదాయం పెరగడానికి కాళేశ్వరమే కారణం కాబట్టి.. ఆ లెక్కన 80వేల కోట్ల కాళేశ్వరం ఖర్చు ఎప్పుడో తిరిగొచ్చేసిందనేది సీఎం కేసీఆర్ చెప్పిన లెక్క. మీకసలు అర్థమవుతోందా!?
కాళేశ్వరం నీళ్లు.. రైతులు పండించిన పంట.. 80 వేల కోట్ల ఆదాయం.. అంతా కన్ఫ్యూజన్గా ఉందా? లెక్క సరిపోవట్లేదా? మరి, సీఎం కేసీఆర్ అక్షరాలా ఇదే లెక్క చెప్పారు. ఏం చేద్దాం.. సర్దుకుపోదామా? తిరిగి ప్రశ్నిద్దామా?
ఇంకా చాలానే చెప్పారు.. తెలంగాణలో ధాన్యం విపరీతంగా పండుతోందని.. పొలాలు, రోడ్లు, రైస్ మిల్లులన్నీ వడ్లతో నిండిపోతున్నాయని.. వడ్లు పట్టడానికి మన మిల్లుల సామర్థ్యం సరిపోవట్టేదని అన్నారు. అందుకే, మిల్లింగ్పై జపాన్కు చెందిన ఓ కంపెనీతో మాట్లాడుతున్నామని కూడా చెప్పారు. ఇక, ధరణితో ఎన్నో లాభాలు ఉన్నాయని, అందులో మార్పులు చేసే అధికారం ఆ రైతుకు తప్ప ఎవరికీ లేదని.. ధరణి వల్లే భూములు ధరలు పెరిగాయని.. ధరణి లేకపోతే రైతు బంధు ఎలా వస్తుందని.. ఇలా చాలానే చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్.