Anti Incumbency in AP | తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టిస్తున్నాయి. ఎందుకంటే బిఆర్ఎస్కి మద్దతుగా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది.
Anti Incumbency in AP | తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత దేశంలోని అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. అయితే జాతీయ సర్వే సంస్థలు సహా అన్నీ తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని తేల్చి చెప్పాయి. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నా.. తెలంగాణలో ధరల పెరుగుదల, కేసీఆర్ నియంతృత్వ ధోరణి, పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, ధరిణి వల్ల పెరిగిన భూసమస్యలతో తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి.
అయితే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా కాంగ్రెస్కే విజయకాశాలు ఉన్నట్లు తెలిపాయి.
కానీ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టిస్తున్నాయి. ఎందుకంటే బిఆర్ఎస్కి మద్దతుగా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది. ఏపీలో కాంగ్రెస్ అస్తిత్వం కోల్పోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఏపీలో మళ్లీ కాంగ్రెస్ జీవం పోసుకునే అవకాశాలున్నాయి.
తెలంగాణలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు బీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా? అన్నట్లు ముందుకు సాగాయి. కానీ కర్ణాటక గెలుపు తరువాత కాంగ్రెస్ ఒక్కసారిగా దూకుడు పెంచింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అలా బిజేపీ క్రమంగా కనుమరుగైపోయింది. కాంగ్రెస్ తెలంగాణలో గెలిస్తే ఏపీలో వైసీపీ మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత పరిస్థితులు కాంగ్రెస్కు అనుకూలంగా మారాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల కూడా ప్రజలకు వ్యతిరేకత కనిపిస్తోంది. వైసీపీ హయంలో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన అసలు జరుగలేదు. నవరత్నాల సంక్షేమ పథకాలు అని జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నా.. ఆశించిన స్థాయిలో పేదల జీవన ప్రమాణాలు పెరగలేదు. పెరిగిన నిత్యావసరాల ధరలు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు, కరెంటు చార్జీలు, ఇతర పన్నులు సామాన్యుల జీవితాలను మరింతగా కుంగదీశాయి. ఈ కారణాల వల్ల ఆంధ్రా ప్రజలలో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందనేది వాస్తవం.
తెలంగాణలో ఎలాగైతే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు లాభం చేకూరిందో.. అలాగే ఏపీలో కూడా జగన్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత వల్ల తాము అధికారంలోకి వస్తామని టిడీపి భావిస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతోందనే విషయం తెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధిస్తే.. జగన్ సర్కారుకు చెమటలు పడతాయంటున్నారు.