CM Revanth Reddy Review Meeting On Drugs Eradication: తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో మరింత యాక్టివ్గా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి గంజాయి,డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని సీఎం అధికారులను ఆదేశించారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని.. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం. గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్ను బ్రేక్ చేయాలని.. అసలు వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలని పేర్కొన్నారు.
ఇక డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ను ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్గా పని చేసేవారిని ప్రోత్సహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా.. ప్రభుత్వం అన్ని సమకూరుస్తుందన్నారు.
డ్రగ్స్ పదం వింటేనే భయపడేలా చర్యలుండాలని స్పష్టం చేశారు.
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని, దేశంలో ఇతర రాష్ట్రాలకు TGNAB ఆదర్శంగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అంతకుముందు హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన విపత్తు నిర్వహణ చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలంటూ సీఎం ఆదేశించారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని ఆదేశాలిచ్చారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు వ్వవస్థ పనిచేయాలని.. అలాంటి వ్వవస్థను రూపొందించాలన్నారు సీఎం. ఇక ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేల వ్యవస్థ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దీనికి సంబంధించి జూన్ 4 లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నాళాల పూడికతీతలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు సీఎం. పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించాలని.. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసువాలన్నారు.
ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానంటూ సీఎం స్పష్టం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హుకుం జారీ చేశారు. హైదరాబాద్ నగర ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తామన్నారు. అలాంటి వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని తెలిపారు సీఎం.