CISF: హైదరాబాద్ హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో జరిగిన సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే వేడుకలకు కేంద్ర హోమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వేడుకల్లో పాల్గొన్నారు. అమర జవాన్లకు అమిత్ షా నివాళులు అర్పించి.. సీఐఎస్ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
53 ఏళ్లుగా దేశాన్ని రక్షించడంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సాధించిన విజయాలకు భారత్ గర్విస్తుందని అమిత్ షా అన్నారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్లో లక్షా ఎనభై వేల మంది పనిచేస్తున్నారని.. ఎంతో మంది జవాన్లు విధులు నిర్వహిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించారని తెలిపారు. సీఐఎస్ఎఫ్ పోలీసుల వల్లే దేశంలో ఉగ్రవాద, మావోయిస్టుల కార్యకలాపాలను అదుపు చేయగలిగామని చెప్పారు.
అలాగే సీఐఎస్ఎఫ్కి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు. డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.