Chota News: గ్రేటర్ హైదరాబాద్కు పిడుగులాంటి వార్త. మూడు నాలుగు రోజులు తాగునీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారంలోని వాటర్ ఫిల్టర్లోని మోటార్లు నీటమునిగాయి. పంప్ హౌస్లో ఓవర్ ఫ్లో కావడంతో భారీగా నీరు చేరింది. దీంతో మోటార్లు పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ భక్తుడు ఆనంద నిలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆలయం మొదటి ప్రాకారం వరకు సెల్ఫోన్ ఎలా తీసుకెళ్లాడనే ప్రశ్న తలెత్తుతోంది. నిన్న రాత్రి దర్శనానికి వెళ్లిన సమయంలో.. తనిఖీలు సక్రమంగా చేయకపోవడంతో ఓ యువకుడు సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లాడు. వర్షం వస్తున్న సమయంలో ఆనంద నిలయంలోని బంగారు గోపురం మీద వర్షం పడుతున్న విజువల్స్ చిత్రీకరించాడు.
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం దద్దనల్ ప్రాజెక్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-బైకు ఢీకొని తల్లీ, కూతురు మృతి చెందారు. బంధువుల వివరాల మేరకు ప్యాపిలి మండలం అలెహబాద్ పల్లె గ్రామానికి చెందిన మనోహర్, లక్ష్మి దంపతులు కుమార్తె మానసతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా బనగానపల్లెకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొని తల్లి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఓ పెళ్లి బరాత్లో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. శ్రీ నగర్కాలనీలో మద్యం మత్తులో డీజే సౌండ్స్తో హంగామా చేశారు. వారిని వారించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో యువకులపై ఎస్సై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పోరుబాట పట్టారు. నాలుగేళ్లలో మూడు సార్లు సీఎం జగన్ సంతకం చేసినా.. ఫైల్ ముందుకు కదలడం లేదని వాపోయారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై అలసత్వం వద్దంటూ పోస్ట్ కార్డులు, వాట్సాప్ మెసేజ్లు, ఎస్ఎంఎస్ల ద్వారా ప్రభుత్వానికి సందేశం పంపి నిరసన తెలియజేశారు.
వేములవాడ అర్బన్ మండలం ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు దీక్షలకు దిగుతామని ప్రకటించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీక్షలకు అనుమతి లేదంటూ 144 సెక్షన్ విధించారు. నిన్నటి నుంచి ఈ నెల 12 వరకు సభలు, సమావేశాలకు అనుమతి లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీక్షను వాయిదా వేసినట్లు ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు.
రాజస్థాన్లో యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఈ రోజు ఉదయం రాజస్థాన్లోని హనుమాన్గఢ్లో ఓ ఇంటిపై కుప్పకూలింది. ఎయిర్క్రాఫ్ట్లోని కొంత భాగం పడిపోవడంతో ఇద్దరు పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. పైలట్ సురక్షితంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ రుక్మణి రియార్ వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొమ్మర పోచంపల్లి చెరువు వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి దారుణ హత్యకు గురైన వ్యక్తిని స్థానిక సెంట్రింగ్, ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్ గౌడ్గా గుర్తించారు. రక్తపు మడుగులో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతరం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్లో ఉచిత కబడ్డీ శిక్షణ శిబిరాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రారంభించారు. మన రాష్ట్ర క్రీడ అయిన కబడ్డీ రోజురోజుకు ఎంతో ఖ్యాతి పొందుతోందని.. అయితే సరైన శిక్షణ లేక ఎంతో మంది విద్యార్థులు క్రీడాకారులుగా తయారుకావడం లేదని, దానిని పూర్తిగా రూపు మాపి విద్యార్థులను ఉన్నత క్రీడాకారులుగా తయారు చెయ్యడం కోసమే శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు.
మణిపూర్ నుంచి హైదరాబాదుకు రెండు ప్రత్యేక విమానాలు రానున్నాయని జీఏడీ జాయింట్ డైరెక్టర్ అరవింద్ సింగ్ తెలిపారు. ఓ విమానంలో తెలంగాణకు చెందిన 103 మంది విద్యార్థులు వస్తున్నారని చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు విద్యార్థులు చేరుకుంటారని.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు చేరుస్తామన్నారు.
చంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మిని స్టేషన్లో శిక్షణ పూర్తిచేసుకున్న తీహార్ జైలు వార్డన్లకు పాసింగ్ అవుట్పరేడ్ నిర్వహిoచారు. హోంమంత్రి మహమూద్ అలీ.. వార్డన్ల కవాతు ప్రదర్శనను వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. తీహార్ సెంట్రల్ జైలు సిబ్బందికి తెలంగాణ జైళ్ల శాఖ పర్యవేక్షణలో 7 నెలలుగా శిక్షణ ఇచ్చామని హోంమంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి అని చెప్పారు.
హైదరాబాద్లోని హయత్ నగర్లో టీసీఎస్ అయాన్ డిజిటల్ వద్ద టీఎస్పీఎస్పీ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. సమయానికి వచ్చినా కూడా లోపలికి అనుమతించకుండా గేటుకు తాళాలు వేయడంపై మండిపడ్డారు. గుర్తింపు కార్డుల జిరాక్స్ కోసం వెళ్లి వచ్చే సరికి అధికారులు తాళాలు వేశారని వాపోయారు. సుమారు 30మంది అభ్యర్థులు అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శించారు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, అక్రమ పనిష్మెంట్లను రద్దు చేయాలని, పాఠ్య పుస్తకాలు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. అనవసర యాప్ల భారం తగ్గించాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని, 117 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జూలై 9న సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. జూలై 10న భవిష్యవాణి కార్యక్రమం ఉంటుందన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాలు, బతుకమ్మ వేడుకలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని తలసాని చెప్పారు.
గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మొలకెత్తిన జొన్నలను తాడుకి కట్టి నిరసన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని సబ్కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యువకులు పాల్గొనడం లేదని కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ విమర్శించారు. కర్నూలులో యువగళం పాదయాత్ర కొనసాగుతోందని.. తనపై లోకేష్ చేసిన విమర్శలపై చర్చకు ఆహ్వానించి నిజాలు తెలుసుకోవాలని హాఫీజ్ కోరారు. తనపై చేసిన విమర్శలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడంతో పాటు తన ఆస్తి మొత్తం రాసిస్తారని సవాల్ చేశారు.
హైదరాబాద్లో బీజేపీ కార్పొరేటర్లు మళ్లీ నిరసనకు దిగారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ను అధికారులు బాయ్కాట్ చేయడంపై బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్కాట్ చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ట్యాంక్బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
హైదరాబాద్ సాగరతీరంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా.. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచేలా నీరా కేఫ్ను నిర్మించారు. ఈ నీరా కేఫ్లో లభించే నీరాలో ఆల్కహాల్ ఉండదని… ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. నీరా హెల్త్ డ్రింక్ అని.. నీరాతో 16 బై ప్రొడక్ట్స్ ఉంటాయని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం వడ్డేపల్లి గ్రామస్థులు రోడ్డెక్కారు. సురభి రసాయన పరిశ్రమ నిర్మాణం వెంటనే నిలిపి వేయాలంటూ 5 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఇప్పటికే మండలంలో ఉన్న చాలా పరిశ్రమల కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వాపోయారు. ఇప్పుడు మరో పరిశ్రమ వస్తే హత్నూర మండలమంతా కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేరళలో పడవ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. మలప్పురంలోని కెట్టుంగల్ బీచ్ వద్ద పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో 30 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. చనిపోయినవారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో కాపాడిన నలుగురు బాధితులను… కొట్టక్కల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.