Chiranjeevi: ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నా.. ఇప్పుడు సరైన సమయంలోనే నాకు ఇచ్చారని భావిస్తున్నా.. అంటూ “ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022” అవార్డు అందుకున్నారు చిరంజీవి. అవార్డు ఇచ్చినందుకు ఇఫీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా నిలిచే అవార్డుల్లో ఇదొకటి అన్నారు.
“45 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా. రాజకీయంలోకి వెళ్లడం వల్ల కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది. అప్పుడే సినిమా విలువేంటో మరింత తెలిసింది. ఏ రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు. కానీ, చిత్ర పరిశ్రమలో లేదు. ఇక్కడ ప్రతిభ ఒక్కటే కొలమానం. ప్రేక్షకుల ప్రేమకు దాసుణ్ని. జీవితాంతం చిత్ర పరిశ్రమలోనే ఉంటా” అంటూ చిరంజీవి భావోద్వేగంతో మాట్లాడారు.
ఈ సందర్భంగా గతాన్ని ప్రస్తావించారు చిరంజీవి. ‘గతంలో చలన చిత్రోత్సవ వేడుకలకు ఓసారి వచ్చా. దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫొటో కూడా లేదని చాలా బాధపడ్డా. ఇప్పుడు అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది. నాకు యువ హీరోలు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ. వాళ్లకు ఇప్పుడు కష్టకాలమే’ అన్నారు చిరంజీవి.
గోవా వేదికగా జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ముగింపు వేడుకలో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు చిరంజీవి.