Chiranjeevi : బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని సోమవారం వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతోందని తెలిపారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ , టీడీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన పరిస్థితిపై ప్రజల్లోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు తారకరత్న కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా సినీ నటులు సోషల్ మీడియా ద్వారా తమ సందేశాలను పంపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ శుభవార్తని వెల్లడించింది.
సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారని చిరు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చిందని తెలిపారు. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుంచి అతడిని కాపాడిన డాక్టర్లకు, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పారు. దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను డియర్ తారకరత్న అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
ప్రస్తుతం చిరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తారకరత్న సంబంధించిన లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ చిరంజీవికి తెలిసిందా? అనే ప్రశ్నలు ఎదురుతున్నాయి. ఆ సమాచారం తెలిసిన తర్వాతే ఈ ట్వీట్ చేశారని టాక్ నడుస్తోంది. చిరంజీవి వెల్లడించిన విషయం ప్రకారం తారకరత్నకు ఆరోగ్యం మెరుగుపడుతోంది తెలుస్తోంది. ఇక ఆయనకు ప్రాణాపాయం తప్పిందనే అనిపిస్తోంది. వైద్యులు కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇస్తే నందమూరి ఫ్యాన్స్, టీడీపీ అభిమానులతోపాటు తెలుగు ప్రజలు సంతోషిస్తారు. చిరు ట్వీట్ తో మంచి వార్త చెప్పడం ఊరటకలిగిస్తోంది.
5 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి కుప్పం వెళ్లి తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను తొలుత కుప్పం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ప్రత్యేక అంబులెన్స్లో బెంగళూరుకు తరలించారు. అక్కడ నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. మరి వైద్యులు కూడా తారకరత్నకు ప్రాణాపాయం లేదని ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు.