Hyderabad: రాష్ట్ర ప్రభుత్వ నగర విస్తరణకు కీలక నిర్ణయం తీసుకుంటున్నది. రీజినల్ రింగ్ రోడ్డు వరకు పట్టణాన్ని క్రమంగా విస్తరించాలని చూస్తున్నది. జీహెచ్ఎంసీ చుట్టుపక్కలలోని మున్సిపాలిటీలను కలుపుకోవాలనే ఆలోచనలు చేస్తున్నట్టూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నదని తెలుస్తున్నది. హైడ్రాను ఒక శక్తిమంతమైన వ్యవస్థగా రూపొందించాలని అనుకుంటున్నది. విదేశాల్లో ఉన్నట్టుగా విపత్తు, అత్యవసర సమయాల్లో అలాగే.. నగరంలో భూకబ్జా వంటి నేరాలను ఆదిలోనే గుర్తుపట్టి అడ్డుకునేలా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే హైడ్రా వ్యవస్థపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. హైడ్రా వ్యవస్థకు రూపునివ్వడం, అలాగే.. ఈ వ్యవస్థ విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారని, 12 మంది సభ్యులతో కమిటీ ఉంటుందని ఓ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీలో సభ్యులుగా మున్సిపల్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జీ మంత్రి, హెచ్ఎండీఏ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, చీఫ్ సెక్రెటరీ, డీజీపీ, రెవెన్యూ మంత్రి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ మేయర్, హైడ్రా కమిషనర్ సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.