Cheguvera daughter hyderabad tour: కమ్యూనిస్ట్ విప్లవ యోధుడు కామ్రేడ్ చెగువేరా కుమార్తె అలైదా గువేరా, ఆయన మనవరాలు ఎస్తేషానియా హైదరాబాద్ లో పర్యటించారు. అంతకముందు శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్న అలైదా, ఎస్తేషానియాకు వామపక్ష నాయకులు, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో అలైదా గువేరా మాట్లాడారు.
క్యూబాలో తాము పేదల మాదిరిగా బతుకుతాం.. కానీ చావు మాత్రం అలా ఉండదని అన్నారు. అక్కడ ఎవరైనా సరే ధనికుల లెక్క చనిపోతారని చెప్పారు. ఎందుకంటే అక్కడ అందరికీ అన్ని రకాల వసతులు కల్పిస్తారని అన్నారు. క్యూబాలో మహిళలకు తగిన గౌరవం ఉంటుందని అన్నారు. ఆడ.. మగ.. అనే వ్యత్యాసం ఎక్కడా కనిపించదని… సమాన పని.. సమానం వేతనం… సమాన అవకాశాలు కల్పిస్తారని చెప్పారు.
నాన్న చెగువేరాతో తనకున్న అనుబంధం మెరుపు లాంటి అనుభూతి అని గుర్తు చేసుకున్నారు. నాన్నతో తాను తక్కువ సమయం ఉన్న…ఆయన ఒక గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసేవారని.. సామాజిక సేవలో ముందుండే వారని గుర్తు చేసుకున్నారు. నాన్న రాసిన సోషలిజం పుస్తకం తనకెంతో ఇష్టమని చెప్పారు.
ఫిడెల్ క్యాస్ట్రోతో నాన్న కంటే ఎక్కువ సమయం గడిపానని అలైదా గువేరా అన్నారు. ఆయనతో తనది తండ్రి, కూతురు బంధమని చెప్పుకొచ్చారు. తన కూతురు పుట్టినప్పుడు విక్టోరియా అని పేరు పెట్టాలని కోరారని.. కానీ అది కుదరలేదని చెప్పారు.
క్యూబాలో ఒకప్పుడు నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు క్యూబా వైద్యులు వెళ్లి వైద్యం అందిస్తున్నారని అన్నారు. తమ దేశానికి అన్ని విధాలుగా తామే అధిపతులమని.. తమపై ఎవరి పెత్తనం లేదని చెప్పారు. ఆ తర్వాత అలైదా గువేరా, ఎస్తేషానియా… హిమాయత్ నగర్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు.