Chandrashekar BJP (Today breaking news in Telangana) : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. BRSతో BJP చెలిమి చేస్తోందని ఆరోపిస్తూ.. కాషాయ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఏ. చంద్రశేఖర్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చంద్రశేఖర్ భావిస్తున్నారు. అక్కడ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి పోటీ చేయకుంటే బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.
బీజేపీ నాయకత్వంపై చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. పార్టీలో పనిచేసేవారిని ప్రోత్సహించడం లేదని మండిపడ్డారు. బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం తనకు నచ్చలేదన్నారు. చంద్రశేఖర్ కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. చంద్రశేఖర్ తో మంతనాలు జరిపారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయనను
బుజ్జగించేందుకు ప్రయత్నించారు. వరంగల్ టూర్ కు మోదీ వచ్చిన సమయంలో చంద్రశేఖర్ కు ఆహ్వానం అందలేదు. అందుకే ఆయన అలిగారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాతే ఆయనతో ఈటల భేటీ అయ్యారు.
చంద్రశేఖర్ 1985 నుంచి 2008 వరకు 5సార్లు వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత చంద్రశేఖర్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఎక్కువకాలం బీజేపీలో ఇమడలేకపోయారు.