HYD Metro: హైదరాబాద్ మెట్రోను శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెట్రో నిర్మించనున్నారు. మెట్రో రూట్ మ్యాప్ పై కార్యకరణ రెడీ అవుతోంది. అయితే, ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైల్ వేయడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. మధ్యలో అనేక ఆటంకాలు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లతో అడ్డదిడ్డంగా ఉందా రూట్. ఈ విషయం మరెవరో చెబుతున్నది కాదు. స్వయంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డినే అంటున్నారు మరి.
రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్రామ్గూడ జంక్షన్ వరకు మెట్రో నిర్మాణం అతి క్లిష్టమైనదని మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలోని అడ్డంకులు దాటుకొని మెట్రో నిర్మించేందుకు అత్యుత్తమ ఇంజినీరింగ్ పరిష్కారాల కోసం అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పలుమార్లు ఈ మార్గాన్ని పరిశీలించిన అధికారులు మరోసారి రూట్మ్యాప్ పరిశీలన చేపట్టారు.
మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, రైల్వే బోర్డు సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు శనివారం ప్రత్యక్షంగా రూట్ మ్యాప్ను పరిశీలించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నానక్రామ్గూడ జంక్షన్ వరకు.. మెట్రో నిర్మాణం చాలాక్లిష్టమైన పనిగా గుర్తించారు.
మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర అండర్పాస్, మధ్యలో రోటరీ క్లబ్, పైన ఫ్లైఓవర్ ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. 21 మీటర్ల ఎత్తులో మైండోస్పేస్ జంక్షన్ దాటడం సవాలుతో కూడుకున్న పని. ఫ్లైఓవర్ పిల్లర్లకు దూరంగా మెట్రో పిల్లర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో మెట్రో నిర్మాణం ఏవిధంగా చేపట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎదురయ్యే సాంకేతిక సవాళ్లు ఏంటి? పరిష్కార మార్గాలు ఏమేం ఉన్నాయి? తదితర అంశాలపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పర్యవేక్షణలో ఇంజినీర్ల టీమ్ కసరత్తు చేస్తోంది. ఎంత కష్టమైనా.. సవాల్ ను స్వీకరిస్తామని అంటున్నారు మెట్రో అధికారులు.