Chada: కమ్యూనిస్టులు. ఒకప్పుడు ఓ వెలిగారు. ఇప్పుడు వెలుగు కోసం పరితపిస్తున్నారు. కేరళ మినహా.. దేశంలో కామ్రేడ్ల ఆధిపత్యం ఎక్కడా కనిపించట్లేదు. కానీ, దాదాపు అన్నిరాష్ట్రాల్లోనూ ఉనికి మాత్రం కొనసాగిస్తున్నారు. గతంలో తోకపార్టీలంటూ విమర్శించిన కేసీఆర్ అంతటివారే.. ఇప్పుడు కామ్రేడ్లతో పొత్తు పెట్టుకుంటున్నారు. వారు జతకలిస్తేనే గెలుపు సాధ్యమనే స్థాయికి వచ్చారు. అలాంటి కమ్యూనిస్టులపై తరుచూ విమర్శలు వస్తుంటాయి. వాళ్లు దేశ ద్రోహులని, కులమతాలకు వ్యతిరేకమని, దేవుళ్లంటే పడదని.. ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి.
అప్పట్లో సీపీఐ నారాయణ ఓ గుడికి వెళితే.. ప్రత్యర్థి పార్టీలన్నీ నానా రకాలుగా విమర్శించారు. కామ్రేడ్లు విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని అబాంఢాలు వేశారు. అయితే, కమ్యూనిస్టులు దేవుళ్లకి వ్యతిరేకం కాదంటూ తాజాగా క్లారిటీ ఇచ్చారు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. ఎందుకంటే, భోగి నాడు ఆయన కూడా గుడికి వెళ్లారు కాబట్టి.
కమ్యూనిస్టులు దేవుళ్లకు వ్యతిరేకం కాదని, దేవుళ్లను నమ్ముతారని, దేవున్ని నమ్మడం అనేది మానవతా సిద్ధాంతం అని చాడ వెంకటరెడ్డి సెలవిచ్చారు. మానవ అభివృద్ధి జరిగినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని, ఆ దిశగా తమ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు.
కమ్యూనిస్టులు దేవుడిని నమ్మరు అని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో నాస్తికులు, ఆస్తికులు ఉంటారని.. మతం అనేది విశ్వాసానికి సంబంధించిన విషయమని అన్నారు. మతం పేరుతో, కులం పేరుతో ఆధిపత్యం చెలాయించాలని మత ఉన్మాదులు ప్రయత్నాలు చేస్తున్నారని.. అందుకు కమ్యూనిస్టులు వ్యతిరేకమని తెలిపారు.
భోగి పండుగ సందర్భంగా.. కొత్తకొండ వీరభద్రస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు చాడా వెంకట్ రెడ్డి. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.