Celebrity Votes: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తొలిఓటు తమదేకావాలని పోలింగ్ బూత్ ల వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ లో మొత్తం 15 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 35 వేల మంది పై చిలుకు పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.
కాగా.. జూబ్లీహిల్స్ లో ఒకే ఒక్క పోలింగ్ బూత్ ఉండగా.. ఇక్కడ 1531 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు, నటీనటులు ఈ పోలింగ్ బూత్ లో ఓటేయనున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబంతో సహా ఓటు హక్కును వినియోగించుకోగా.. స్టార్ హీరోలు అల్లు అర్జున్, సుమంత్ లు క్యూ లైన్లో నిలబడి ఓటేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కుటుంబంతో సహా పోలింగ్ బూత్ కు చేరుకుని ఓటేశారు. ఇదే పోలింగ్ స్టేషన్ లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఓటు వేశారు.
దర్శకుడు తేజ, నటుడు విక్టరీ వెంకటేష్, హీరో నితిన్, డైరెక్టర్లు రాఘవేంద్రరావు, రాజమౌళి, రమ, నటుడు శివాజీ రాజా, నేచురల్ స్టార్ నాని, యాంకర్ సుమ, హీరో సుధీర్ బాబు దంపతులు, రవితేజ, ప్రియదర్శి, గోపీచంద్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు పెద్ద సెలబ్రిటీల ఓట్లు ఈ బూత్ లోనే ఉండటంతో.. పోలీసులు బందోబస్త్ ను మరింత పటిష్టం చేశారు.