ORR Accident Prone Area: అతివేగం, డ్రంకెన్ డ్రైవింగ్ ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు ప్రమాదాల బారినపడి వేలాది మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. గత రెండు సంవత్సరాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 17,699 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
అందులో 3,441 మంది మృతి చెందగా.. 16,807 మంది గాయాల పాలయ్యారు. వారిలో చాలా మంది దివ్యాంగులుగా మారి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అధిక శాతం ప్రమాదాలు డ్రంకెన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Read More: పబ్లిక్ ప్లేసుల్లో రొమాస్స్.. జంటలను అదుపులోకి తీసుకున్న షీ టీమ్..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్య గురించి మనకి తెలిసిందే. ట్రాఫిక్ బారి నుంచి బయటపడటానికి నగరం మధ్యలో నుంచి కాకుండా శివారు ప్రాంతాల్లోకి చేరుకునేందుకు రాజీవ్ గాంధీ ఔటర్ రింగ్రోడ్డు(ORR) నిర్మించారు. అతిపెద్ద రింగ్ రోడ్డు విశాలంగా ఉండటం. ట్రాఫిక్ సమస్య అసలే లేకపోవడంతో కొంతమంది వాహనదారులు ఓఆర్ఆర్ ఎక్కగానే డ్రైవింగ్లో తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
ఈ రింగ్ రోడ్డుతో ఎంతమంది ప్రయాణ సమయం తగ్గిందో తెలియదు కానీ.. ఎన్నో వేలాది ప్రజల ఆయువు మాత్రం తగ్గింది. ఈ రోడ్డు ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఈ రింగ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలోనే మృతి చెందింది. ఆ రోడ్డు నిత్యం రక్తపు మరకలతో నిండిపోతోంది.
ఆ రింగ్ రోడ్డు సామాన్యులతో పాటు ఎందరో ప్రముఖులను బలిగొంది. మంత్రి కోమటిరెడ్డి కుమారుడు సహా ఎందరో ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులను పెద్ద ఎత్తున పొట్టన పెట్టుకుంది. లాస్య నందిత ప్రమాదంతో మరోసారి ఆ దారుణ ఘటనలు గుర్తుకు వస్తున్నాయి.
మంత్రి పి. ఇంద్రారెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ సమీపంలోని పాల్కాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాటి మంత్రి పి.ఇంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.
మంత్రి కోమటిరెడ్డి తనయుడు
ఓఆర్ఆర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణం నాడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. 19 డిసెంబర్ 2011న పటాన్చెరుకు స్నేహితులతో కలిసి ప్రతీక్ రెడ్డి అత్యంత వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో ప్రతీక్ రెడ్డితోపాటు మరో ఇద్దరు యువకులు కూడా మృత్యువాత పడ్డారు.
రవితేజ సోదరుడు
శంషాబాద్ మండలం కొత్వాల్గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై స్కోడా కారులో ప్రయాణిస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో సినీ నటుడు రవితేజ సోదరుడు భూపతిరాజు భరత్ రాజు మృతి చెందాడు. తీవ్ర గాయాలతో భరత్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు.
మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు
భారత మాజీ కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అయాజుద్దీన్ (19) కూడా ఔఆర్ఆర్పై మృతి చెందాడు. ఓఆర్ఆర్పై నిర్వహించిన బైక్ రేసింగ్లో అయాజుద్దీన్ పాల్గొన్నడు. ఆ సందర్భంగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కోట శ్రీనివాసరావు తనయుడు
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తనయుడు వెంకటసాయి ప్రసాద్ సీసీ స్పోర్ట్స్ బైక్పై వెళ్తుండగా డీసీఎం వాహనాన్ని తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఫిలింనగర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్కు వెళ్తుండగా తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద డీసీఎం అకస్మాత్తుగా వచ్చింది. సీసీ స్పోర్ట్స్ బైక్పై వెళ్తున్న వెంకటసాయి సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆకాశంలోకి ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. కొడుకు మృతిని కోట శ్రీనివాస రావు ఇప్పటికీ జీర్నించుకోలేకపోతున్నారు.
ఇల ఎన్నో ఘటనలు ఓఆర్ఆర్పై చోటుచేసుకున్నాయి. అయితే ఓఆర్ఆర్ ప్రయాణానికి ఎంతో సౌకర్యంగా .. గమ్యాలకు త్వరగా చేరుకునేందుకు మంచిమార్గంగా ఉంది. కానీ ప్రమాదాలకు కూడా కేంద్రంగా నిలుస్తోంది. ఓఆర్ఆర్ నిర్మాణంలో కొన్ని లోపాలు ఉన్నాయని గతంలోనే తేలింది. ఆ లోపాలను సరిదిద్దడంలో అధికారులు విఫలమయ్యారు. వీటితోపాటు వాహనాలు నడిపేవారు అత్యంత వేగంగా వెళ్లడంతో అకస్మాత్తుగా వాహనాలు రావడం, రోడ్డు నిబంధనలు ఉల్లంఘించడం, వాహనం నడిపేవారు నిద్రమత్తు లేదా మద్యంమత్తులో ఉండటం వంటి కారణాలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి.