Kavitha : ఢిల్లీ మద్యం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో కవిత ఇంటికి రెండు బృందాలు వచ్చాయి. విచారణ కోసం కవిత ఇంట్లోని ఒక గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. తన అడ్వకేట్ సమక్షంలో స్టేట్ మెంట్ ను కవిత ఇస్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో సాక్షిగా మాత్రమే కవిత వివరణను సీబీఐ అధికారులు నమోదు చేస్తున్నారు. సీఆర్పీసీ 160 కింద వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు. విచారణకు వచ్చిన సీబీఐ బృందంలో మహిళా అధికారులు ఉన్నారు.
ఢిల్లీ మద్యం కేసులో ఈ నెల 6న కవితను విచారించేందుకు సీబీఐ మొదట లేఖ రాసింది. అయితే ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలున్నాయని 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని కవిత సీబీఐకి తిరిగి లేఖ రాశారు. దీంతో సీబీఐ ఈ నెల 11న విచారిస్తామని సమాచారం ఇవ్వగా కవిత అంగీకరించారు. దీంతో హైదరాబాద్ లోని ఆమె నివాసానికి సీబీఐ అధికారులు వచ్చారు.
ఢిల్లీ మద్యం స్కామ్ లో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత.. ఆమెకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో నిందితులు బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, సమీర్ మహేంద్రు స్టేట్ మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు కవిత శనివారం ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ను కలిశారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కవితతో కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజకీయకక్షతో ఇబ్బందులు పెట్టేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా… అవి ఫలించవని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. సీబీఐకి ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించారట. సీబీఐ విచారణ నేపథ్యంలో ఇప్పటికే కవిత పలువురు న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు.
పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ తన ఇంటికి రావద్దని కవిత కోరారు. అయినాసరే బంజారాహిల్స్లోని ఆమె నివాసం వద్ద బీఆర్ఎస్ నేతలు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. “డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెవర్ ఫియర్” అనే స్లోగన్ తో ఫ్లెక్సీలు పెట్టారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటికి వెళ్లే మార్గంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె ఇంటికి భారీగా వస్తారనే సమాచారంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తంమీద కవితను ప్రశ్నించడానికి సీబీఐ బృందం రావడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరింగి.