TDP : అనుమతిలేకుండా హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించడంపై తెలంగాణ టీడీపీ నేతలపై కేసు నమోదైంది. టీడీపీ హైదరాబాద్ నగర కార్యదర్శి జీవీ నాయుడిసహా పలువురు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు బేగంపేట పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఎస్ఐ జయచందర్ ఫిర్యాదుతో క్రైం నంబర్ 531\2023 కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 341, 290, 21 రెడ్ విత్ 76 సీపీ యాక్ట్ కింద టీడీపీ నేతలపై కేసు నమోదైంది. సుమారు 400మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు.. అనారోగ్య కారణాల తాత్కాలిక బెయిలు పొందారు. మంగళవారం జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో దిగగానే టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు కాన్వాయ్ను అనుసరిస్తూ పార్టీ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. దీంతో ఆయన బేగంపేట నుంచి జూబ్లీహిల్స్లోని నివాసానికి చేరుకోవడానికి మూడున్నర గంటల సమయం పట్టింది. ఇలా అనుమతుల్లేకుండా భారీ ర్యాలీ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఉల్లంఘించారని పేర్కొన్నారు.
హైదరాబాద్లో సాధారణ సమయాల్లోనే ర్యాలీలు, నిరసనలు, ప్రదర్శనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ పరిస్థితుల్లో ర్యాలీకి అనుమతి కోసం రిటర్నింగ్ అధికారికి 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల కోసం గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. బుధవారం ఆయన ఇంటికి చేరుకోగానే ఏఐజీ వైద్యుల బృందం కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది. వైద్యుల సూచనతో చంద్రబాబు ఏఐజీకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.